'ఏం అడిగినా కూల్చేస్తారని, బాబుకు బీజేపీ భయం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారతీయ జనతా పార్టీ భయం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య బుధవారం ధ్వజమెత్తారు. ఏం అడిగినా బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చుతుందనే ఆందోళన బాబులో ఉందన్నారు. అందుకే ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ పైన గట్టిగా నిలదీయడం లేదన్నారు.
పయ్యావుల సోదరులు రాజ్యాంగేతర శక్తులు: వైసీపీ
తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ ఇప్పటికీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను గుప్పెట్లో పెట్టుకొని వైసీపీ కార్యకర్తల పైన అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్నారు. ఉరవకొండలో పయ్యావుల సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారారన్నారు.
భూదాన్ బోర్డు రద్దుపై హైకోర్టు కేసులో ఇంప్లీడ్ అవుతాం: కేఈ
భూదాన్ బోర్డు రద్దు పైన హైకోర్టు కేసులో ఇంప్లీడ్ అవుతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. గ్రామకంఠం భూముల పైన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు ఉమ్మడి సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ పైన చట్ట సవరణకు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
పాడేరులో వాల్ పోస్టర్ల కలకలం
విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో వాల్పోస్టర్ల కలకలం రేగింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతల ఆచూకీ తెలిపిన వారికి కోట్లలో బహుమతి ఇస్తామంటూ సీఆర్పీఎఫ్ సిబ్బంది వాల్పోస్టర్లు అతికించారు. మావోయిస్టు నేత గణపతి సమాచారం ఇచ్చిన వారికి రూ.2.52 కోట్లు, కిషన్ సమాచారం ఇస్తే రూ.1.31 కోట్లు ఇస్తామని, చంద్రన్న అలియాస్ భాస్కర్కు రూ.1.52 కోట్లు, వేణుగోపాల్ అలియాస్ వివేక్కు రూ.1.52 కోట్లు, బాలకృష్ణ అలియాస్ భాస్కర్కు రూ.1.45 కోట్లు, సుదర్శన్ అలియాస్ ఆనంద్కు రూ.1.45 కోట్లుగా పోస్టర్లలో పేర్కొన్నారు.