హైకోర్టులో బాబు క్వాష్ పిటిషన్: 'భయం ఎందుకు, ఎవరూ మిమ్మల్ని రక్షించలేరు'
హైదారాబాద్: ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు విషయమై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
ఓటుకు నోటు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, కోర్టు ఉత్తర్వుల ప్రకారం విచారణ జరగాలని ఆయన పేర్కొన్నారు. సీఆర్పీసీ 156 (3) కింద విచారణ జరిగితే చంద్రబాబు దోషా, నిర్దోషా అన్న విషయం తేలిపోతుందని ఆయన అన్నారు.
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాత్రను తేల్చాలని ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓటుకు నోటు కేసులో తాను వేసిన పిటిషన్ విచారణకు అర్హత ఉందని ఏసీబీ కోర్టు చాలా స్పష్టంగా పేర్కొందని అన్నారు.
నిజంగా చట్టాల మీద, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటే, అప్పీలుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కొనడానికి ఎందుకంత భయం అని నిలదీశారు. దోషి అన్న విషయం మీకే తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారా? అని నిలదీశారు.
గత రెండు రోజులుగా నిద్ర లేకుండా గడుపుతున్న మీరు, ఈరోజు ఎందుకు హైకోర్టును ఆశ్రయించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రెండు రోజుల్లో భయం లేనట్లు నటిస్తూనే గవర్నర్ వద్దకు ఎవరెవర్ని పంపారో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉందని అన్నారు.
చట్టంలో ఉన్న చుట్టాలు కూడా ఎవరూ రక్షించలేరని తెలిసే చంద్రబాబు క్వాష్ పిటిషన్తో హైకోర్టును ఆశ్రయించారని అన్నారు. ఓటుకు నోటు కేసులో దర్యాప్తు జరిగితే తాను దోషిగా తేలుతానన్న విషయం చంద్రబాబుకు తెలుసని అన్నారు. ఆడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లు ధ్రువీకరించినందు వల్లే బాబు భయపడుతున్నారని అన్నారు.
ఏసీపీ చంద్రబాబు పాత్రను తేల్చేందుకు సిద్ధమవడంతో భయపడిన చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారని అన్నారు. గతంలో చాలామంది మహామహులు సీఆర్పీసీ 156 (3) కింద జయలలిత, జస్వంత్ సింగ్, కేంద్రమంత్రులు విచారణను ఎదుర్కొన్నారని అన్నారు.
ఓటుకు నోటు కేసులో అసలు విచారణ ఎదుర్కోకుండానే కేసు నుంచి తప్పించుకోవాలని ఆయన క్వాష్ పిటిషన్ వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనిని బట్టే చూస్తుంటే మీరు ఎంత తప్పు చేశారో తెలిసిపోతోందని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన అన్నారు.