పసుపు పండుగ అజెండా: అదొక్కటే టార్గెట్..ఎన్టీఆర్కు భారతరత్న: సంక్షోభాన్ని ఇలా అవకాశంగా
అమరావతి: మహానాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని, వినని వారు బహుశా ఉండకపోవచ్చు. మహానాడు పేరు వింటే తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు సైతం ఊగిపోతారు. టీడీపీలో క్రియాశీలకంగా పని చేసే ప్రతి ఒక్కరు మహానాడును పండుగలా జరుపుకొంటారు. పసుపు పండుగలా భావిస్తారు. అలాంటి మహానాడు మళ్లీ వచ్చింది. బుధ, గురువారాల్లో దీన్ని నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Recommended Video
వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న వైఎస్ జగన్?: ఆ స్థానంలో ఆ సలహాదారు: పార్టీలో జోరుగా
తొలిసారి డిజిటల్ రూపంలో
రెండురోజుల పాటు నిర్వహించబోయే మహానాడు సరికొత్త తరహాలో పార్టీ అభిమానుల ముందుకు రాబోతోంది. డిజిటల్ రూపాన్ని సంతరించుకుంది. జాతీయ స్థాయిలో ఓ పార్టీ కార్యక్రమాన్ని డిజిటల్ ప్లాట్ఫాం మీద నిర్వహించబోతోండటం ఇదే తొలిసారి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని తెలుగుదేశం పార్టీ ఇలా అవకాశంగా మార్చుకుంది. డిజిటల్ రూపంలో కార్యకర్తలు, అభిమానులకు మహానాడును పరిచయం చేస్తోంది.
అజెండాలు కీలకాంశాలు
గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా.. రెండు రోజుల పాటు నిర్వహించబోయే ఈ మహానాడు అజెండాలో పార్టీ అగ్ర నాయకత్వం పలు కీలక అంశాలను చేర్చింది. నలుగురైదుగురు మంది తప్ప మహానాడు ప్రసంగాల్లో పెద్దగా జాతీయ రాజకీయాల ప్రస్తావన ఉండకపోవచ్చని అంటున్నారు. తమ తొలి లక్ష్యంగా..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని తేల్చి చెబుతున్నారు. పార్టీ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడంపైనే అజెండాలోని అంశాలను కేంద్రీకరించామని అంటున్నారు.
రాజకీయ దాడులు..
తెలుగుదేశం అజెండాలో పలు కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. అవన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం చుట్టూ తిరిగేవే. రాజకీయ దాడులు మొదలుకుని.. నిన్న మొన్నటి టీటీడీ నిరర్ధక ఆస్తుల అమ్మకాల వరకూ ప్రతి అంశాలను కూడా అజెండాలో చేర్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే రాష్ట్రంలో రాజకీయ దాడులు మితిమీరిపోయాయని ఆరోపిస్తున్నారు. నాటి ఛలో పల్నాడు అంశాన్ని అజెండా చేర్చారు. ఈ ఏడాది కాలంలో వైసీపీ నాయకుల దాడుల్లో మరణించిన పార్టీ కార్యకర్తలకు శ్రద్ధాంజలి అర్పిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనిపై టీడీపీ ఓ తీర్మానం చేయబోతోంది.
మతం చుట్టూ..
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మత రాజకీయాలు భయానకంగా విస్తరించాయనే అంశంపైనా టీడీపీ డిజిటల్ మహానాడు ఫోకస్ పెట్టింది. నిరర్థక ఆస్తుల పేరుతో శ్రీవారికి దాతలు విరాళాల రూపంలో సమర్పించిన భూములను అమ్మకానికి పెట్టడాన్ని తప్పు పట్టబోతోంది. అదే సమయంలో- ఒక మెజారిటీ వర్గానికి చెందిన ప్రజలపై మతపరమైన దాడులు కొనసాగుతున్నాయనే ఆరోపణలను సంధించబోతోంది టీడీపీ.
ఎన్టీఆర్కు భారతరత్న..
ఇక- మహానాడు అనగానే.. అందరికీ గుర్తుకొచ్చే తీర్మానం- ఎన్టీఆర్కు భారతరత్న. ఈ సారి కూడా ఇదే అంశంపై టీడీపీ తీర్మానం చేయబోతోంది. అటు చిత్ర పరిశ్రమలో.. ఇటు రాజకీయ రంగంలో పెను సంచలనాలకు కేంద్రబిందువైన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారాన్ని అందించాలనే ప్రతిపాదనను టీడీపీ అగ్ర నాయకత్వం తీర్మానాల జాబితాలో చేర్చింది. అత్యంత వివాదాస్పదంగా మారిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టం జాతీయ పౌర నమోదు వంటి అంశాలను పెద్దగా పట్టించుకోకపోవచ్చని అంటున్నారు.