బుగ్గనపై చంద్రబాబు సెటైర్లు, ఫండమెంటల్స్ తెలుసా అని ఫైర్, దిశ నిందితులకు ఉరే సరి..
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థ గురించి తెలియనివాళ్లు తమను విమర్శిస్తారా అని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణంపై బుగ్గన వర్సెస్ చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి వీరి మధ్య అగ్గిరాజేసింది.
సీమలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్: ఇద్దరి లక్ష్యం ఒక్కటే
ఐడియా ఉందా..?
బుగ్గన రాజేంద్రనాథ్కు ఏం తెలుసు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన ఉందా అని విమర్శించారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులు వదిలేసి చివరకు తమనే విమర్శించడం ఏంటి అని మండిపడ్డారు. ఇది జగన్ ప్రభుత్వానికి, బుగ్గన రాజేంద్రనాథ్కు సరికాదన్నారు. తీరు మార్చుకోవాలని సూచించారు.
అప్పు తీర్చలేకపోతున్నారా..?
చంద్రబాబు సోమవారం కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్తల విసృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కోసం తాను అప్పుచేశానా అని ప్రశ్నించారు. తన అప్పును జగన్ తీర్చలేకపోతున్నారా అని దుయ్యబట్టారు. అసలు ఆర్థికమంత్రి సిద్ధాంతాలు తెలుసా అని చంద్రబాబు నిలదీశారు. ఫండమెంటల్స్ తెలియని బుగ్గన తమకు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు.
తప్పుడు కేసులు
టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటివరకు 690 కేసులు పెట్టారని గుర్తుచేశారు. తాము అధికారంలో ఉన్నప్పడు ఇలా ప్రవర్తిస్తే వైసీపీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరామని చంద్రబాబు పేర్కొన్నారు.
చెరువులు నింపలే..
కర్నూలు జిల్లాలో అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేశామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఏడాది వరదలొచ్చినా చెరువులు ఎందుకు నింపలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతుల, ఎమ్మెల్యేల మాఫియా కుమ్మక్కై.. సచివాలయ ఉద్యోగాల్లో 90 శాతం ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని తెలిపారు. కర్నూలు నుంచి ఇసుకను బెంగళూరు, హైదరాబాద్ తరలిస్తున్నామని పేర్కొన్నారు.
ఉరే సరి
దిశ దారుణ హత్య గురించి చంద్రబాబు ప్రస్తావించారు. లైంగికదాడి చేసి హతమార్చిన నిందితులకు ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మృగాళ్లపై కరుణ చూపొద్దని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.