మంత్రి పెద్దిరెడ్డి , వైసీపీ ఎమ్మెల్యేల హింసా రాజకీయాలతో ప్రజాస్వామ్యం అపహాస్యం : చంద్రబాబు ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలును , ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా వైసిపి నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ హింసా రాజకీయాలకు తెరలేపుతున్నారు అని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు.
Recommended Video
జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు: లక్షల కోట్లు కొట్టేద్దామని ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా?
జగన్ ఫ్యాక్షన్ సిద్ధాంతంతో రాజ్యాంగ వ్యవస్థలు అపహాస్యం
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ సిద్ధాంతంతో రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా మాచర్ల, చిత్తూరు జిల్లా పుంగనూరు టిడిపి నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులను మంత్రి పెద్దిరెడ్డి భయపెడుతున్నారని, భయానక వాతావరణం సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు .
ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఎవరైనా అడ్డు పడితే ఈ పని చెయ్యండి
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు రక్షణ కల్పించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ , ఎస్పీ మరియు ఎన్నికల సంఘం పై ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నామినేషన్లు తీసుకోకుండా అడ్డుపడితే ఈమెయిల్ ద్వారా జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషనర్, పార్టీ కేంద్ర కార్యాలయానికి నామినేషన్లు పంపించాలని చంద్రబాబు సూచించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
అభివృద్ధి చెయ్యలేదు కానీ అధికార దుర్వినియోగం చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ నేడు పోటీచేయడానికి బరిలోకి దిగుతున్న అభ్యర్థులను బెదిరిస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అభ్యర్థులను వేధిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. నామినేషన్ వేస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆధారాలతో ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమీషన్ పట్టించుకోదా ?
ఇక పోలీసులు కూడా అభ్యర్థులను బెదిరింపులకు గురి చేయడం అక్రమాలకు పరాకాష్టగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పంచాయితీ ఎన్నికల్లో గ్రామస్తులంతా సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలో జరుగుతున్న దాడులపై సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు.