పొత్తులపై మీకెందుకు? అదీ తెలియదా?: కేఈ, అయ్యన్నపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: పొత్తుల వ్యవహారంపై సీనియర్ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి చేసిన వాఖ్యలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో చర్చించకుండానే పొత్తలపై ఎలా మాట్లాడుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు మంత్రులపై మండిపడ్డారు.
కాంగ్రెస్తో పొత్తా.. అంతకంటే దుర్మార్గం ఉండదు..
గురువారం రహదారులు, భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ టీడీపీ. మా పార్టీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కలిస్తే అంతకంటే దుర్మార్గం ఉండదు. రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేసి దోచుకుతిన్న కాంగ్రెస్తో కలవాలని భావిస్తే మొదట వ్యతిరేకించేది నేనే' అని వ్యాఖ్యానించారు.
పొత్తు పెట్టుకుంటే పార్టీలోనే ఉండను
అంతేగాక, ఒకవేళ తప్పనిసరై కలిస్తే టీడీపీలో తాను ఉండలేనని మంత్రి అయ్యన్న స్పష్టం చేశారు. పొలిట్బ్యూరోలో చర్చలేకుండా పొత్తుల నిర్ణయం జరగదని, కాంగ్రెస్ను తరిమికొట్టేందుకు ఎన్టీఆర్ శ్రమించారని, చంద్రబాబు తప్పు చేయబోరని అనుకుంటున్నానని, నిజంగా కలిస్తే జనం బట్టలూడదీసి తంతారు కదా?.. అని అయ్యన్న వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ శత్రువే.. మోడీ, జగన్కు తోడు పవన్
కర్నూలులో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు అసాధ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ దరిద్రాన్ని అంటకట్టుకోం' అని స్పష్టం చేశారు. టీడీపీకు శత్రువులు కాంగ్రెస్, నరేంద్ర మోడీ, జగన్తోపాటు కొత్తగా పవన్ అని పేర్కొన్నారు.
వివరణ ఇవ్వండి..
పొత్తులపై మాట్లాడిన మంత్రుల వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎన్నికల ముందు పొత్తులపై నిర్ణయించే సంప్రదాయం టీడీపీదని.. పార్టీలో చర్చించకుండా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని సీఎం నిలదీసినట్లు తెలిసింది.
అలా ఎందుకు చెప్పాలి?
మీడియా కథనాలపై మంత్రులు ఇలా స్పందించడం భావ్యం కాదని అన్నారు. పొత్తులపై పొలిట్బ్యూరో నిర్ణయం తీసుకుంటుందని తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఎవరూ మాట్లాడలేదని అన్నారు. పొత్తు కుదిరినట్లు, వ్యతిరేకిస్తున్నట్లు ఎందుకు చెప్పాలని నిలదీశారు.