సీఎం రమేష్ దీక్షపై చంద్రబాబు ఆరా: ‘జగన్-గాలి కోసమే కడప స్టీల్ ప్లాంట్’
అమరావతి: సమష్టి పోరాటంతో కడప ఉక్కు పరిశ్రమను సాధించాలని, కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం సాగించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కడప ఉక్కు దీక్షపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Recommended Video
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవిల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
గాలితో అవసరమేంటి?
గాలి జనార్ధన్ రెడ్డితో స్టీల్ ప్లాంట్ పెట్టించాల్సిన విషయాన్ని చట్టంలో పెట్టాల్సిన అవసరం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. సెయిల్ ద్వారా ఉక్కు పరిశ్రమ పెట్టిస్తామన్న విషయంలో చట్టంలో స్పష్టంగా ఉందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కడప యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీలేని పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీ మొక్కుబడిగానే..
వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసేవి మొక్కుబడి కార్యక్రమాలేనని ఎద్దేవా చేశారు. అందుకే వాటి పట్ల స్పందన కరవైందని అన్నారు. తాను పాదయాత్ర, నిరవధిక దీక్షలు చిత్తశుద్ధితో చేయడంతోనే ప్రజాదరణ పొందాయన్నారు. సొంత జిల్లా అభివృద్ధికి కూడా జగన్ అడ్డుకోవడం హేయమైన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు.
సీఎం రమేష్కు అభినందన
ఉక్కు దీక్షలో అందరూ భాగస్వాములు కావాలని, దీక్షకు మద్దతుగా రాబోయే 3రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలన్నారు. ఆరు రోజులుగా దీక్షన కొనసాగిస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవిలను చంద్రబాబు అభినందించారు. కడప ఉక్కు కోసం అనేక లేఖలు రాశామని, పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించామని, ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామని చెప్పారు. అయినా, కేంద్రంలోని బీజేపీ నేతలు మొండిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
బీజేపీ, వైసీపీ, జనసేన కుట్రలు.. 28న ఢిల్లీలో ధర్నాలు
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మెకాన్ కమిటీ అనుకూలంగా నివేదిక ఇచ్చిందని, కానీ, సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా అఫిడవిట్ వేశారన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లబ్ధి కోసమే కేంద్రం దీనిపై తాత్సారం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ, జనసేన కుట్ర రాజకీయాలను ఎండగట్టాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం అన్ని జిల్లాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, ఎల్లుండి ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. అంతేగాక, జూన్ 28న ఢిల్లీలో ఎంపీలతో ధర్నాలు చేపట్టాలని పార్టీ నేతలను చంద్రబాబు సూచించారు.