ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిలా.. సత్తా చూపిస్తాం, మోడీ గుండెల్లో రైళ్లు: బాబు వార్నింగ్
కర్నూలు: కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోసం చేసిన వారిని వదిలి పెట్టడం తెలుగువారి లక్షణం కాదని.. కసిగా పోరాడుదామని అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలులో టీడీపీ ధర్మపోరాట సభకు చంద్రబాబు హాజరై ప్రసంగించారు.
తెలుగువారి సత్తా చూపిస్తాం
నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ఎదురుతిరుగుతామని, తెలుగువారి సత్తా ఏంటో నిరూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు బొబ్బిలిపులిలా పోరాడారంటూ పార్లమెంట్ లో ప్రధాని మోడీని మన ఎంపీలు నిలదీసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటే ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు.
ఫలితం ఎన్నికల్లోనే తెలుస్తుంది..
‘రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాం. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి.. ఏపీకి అన్యాయం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. అవినీతి ఉచ్చులో పడ్డారు.. దాని ఫలితం ఎన్నికల్లో తెలుస్తుంది' అని చంద్రబాబు హెచ్చరించారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలా... మోడీ గుండెల్లో..
‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆనాడు బ్రిటీష్ వారి గుండెల్లో ఎలా రైళ్లు పరుగెత్తించారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని.. నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలి. తెలుగువారి సత్తా ఏమిటో నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ స్ఫూర్తి మనకుంది. ఐదు కోట్ల మంది అండగా ఉంటే కొండనైనా బద్దలు చేసే శక్తి టీడీపీకి ఉంది' అని చంద్రబాబు అన్నారు.
ఏకైక ప్రభుత్వం
‘పోలవరం తెలుగు జాతి జీవనాడి.. పోలవరం పూర్తి చేయడమే నా జీవితాశయం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా మారుస్తాం. కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం' అని చంద్రబాబు వివరించారు.