90శాతం ఉద్యోగాలు వైసీపీ వాళ్లకే: కలకలం రేపిన విజయసాయి, ఏకిపారేసిన చంద్రబాబు
అమరావతి: ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న ప్రతిపక్ష టీడీపీ నేతలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యల రూపంలో మరో అస్త్రం దొరికింది. గ్రామ, వార్డుల సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, ఏపీపీఎస్సీలో ఉద్యోగుల పేపర్ లీక్ చేశారని ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్ సర్కారే లక్ష్యంగా మండిపడుతున్నారు.
90శాతం ఉద్యోగాలు వైసీపీ వాళ్లకే..
తాజాగా, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు జగన్ సర్కారుకు మరిన్ని చిక్కులు తెచ్చేలా ఉన్నాయి. అసలు ఆయన ఏమన్నారంటే.. వాలంటీర్ల ఉద్యోగాల్లో 90శాతానికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చామని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాగా, విజయసాయి రెడ్డి విశాఖలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో వాలంటీర్ల ఉద్యోగాలపై వ్యాఖ్యలు చేశారు.
అవినీతిని ఎంత నిస్సిగ్గుగా..
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయసాయి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ప్రజల ఓట్లతో గెలిచి ఆ ప్రజలకే ద్రోహం చేస్తూ, కేవలం వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకున్నామని.. తమ అవినీతిని ఎంత నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారో చూడండి' అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో టీడీపీ, నేతలు కార్యకర్తలు ఆ వీడియోలను రీట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
వాళ్లను వదిలేసి మమ్మల్ని అరెస్టులు చేస్తారా?
‘ఇంత బహిరంగంగా తమ అవినీతిని ప్రకటించుకున్న వాళ్ళను వదిలేసి, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన తెదేపా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. పోలీసులకు జీతాలు ప్రజలిస్తున్నారా? వైసీపీ పార్టీ ఇస్తుందా?' అని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగాలంటే పప్పు బెల్లాలా?
‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా?రాక్షస పాలనలో ఉన్నామా? ప్రభుత్వ ఉద్యోగాలను పప్పుబెల్లాల్లా కార్యకర్తలకు పంచడం ఏమిటి? ఈ అవినీతిపై పోరాడేందుకు ప్రజాస్వామ్యవాదులంతా కలిసిరావాలి' అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.