నాకేం జరిగినా జగన్ సర్కారుదే బాధ్యత: కోడెల మృతిపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్మోన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ సర్కారు కోడెలను వేధించి ముప్పు తిప్పలు పెట్టిందని ఆరోపించారు.
అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కోడెలను వెంటాడి అవమానాలకు గురిచేసిందని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పల్నాటి పులిగా ఉన్న వ్యక్తికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు.
కోడెల మృతిపై వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వారి వ్యాఖ్యలపై వైఎస్ జగన్ మౌనం వీడాలన్నారు. కోడెల చేసిన నేరం ఎంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సభాపతి ఇల్లు, క్యాంప్ కార్యాలయానికి ఫర్నీచర్ వాడుకోవచ్చని అన్నారు. రూ. లక్ష విలువైన ఫర్నీచర్ కోసం కోడెలపై ఇన్ని అభియోగాలు మోపుతారా? అని ప్రశ్నించారు.
రూ. 43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీబీఐ నిర్ధరించిందని.. మరి అలాంటి వ్యక్తిని ఏం చేయాలని చంద్రబాబు ప్రశ్నించారు. కోడెలపై పెట్టిన అక్రమ కేసులపై పోలీసులు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తనకు, టీడీపీ నేతలకు ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత అని చంద్రబాబు అన్నారు.