వినాశకాలే విపరీత బుద్ధి, జగన్ రెడ్డిది సైకో మనస్తత్వం.. ఎన్నికల్లో ఆపని చెయ్యండన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై, జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి గల రాజ్యాంగ వ్యవస్థ అని పేర్కొని అలాంటి ఈసీ ఆదేశాలను ధిక్కరించటం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ చర్యలతో రాష్ట్రం నాశనం అవుతుందని మండిపడ్డారు .
జగన్ తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు, ఉద్యోగుల తీరు ఇలా దేశ చరిత్రలోనే లేదు : యనమల ఫైర్
జగన్ రెడ్డిది సైకో మనస్తత్వం , ఉన్మాదిలా ప్రవర్తన
జగన్ రెడ్డిది సైకో మనస్తత్వం అని, ఉన్మాదిలా ఆయన ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నేటి నుండి ప్రారంభమైన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అన్ని చోట్ల నామినేషన్లు దాఖలయ్యేలా చూడాలని, బలవంతపు ఏకగ్రీవాలు లేకుండా దృష్టిసారించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులను కోరారు. పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్న చంద్రబాబు,అన్ని విధాలుగా అభ్యర్థులు సమాయత్తం కావాలని సూచించారు.
ఎన్నికలంటే వైసీపీ కి భయం పట్టుకుంది
పంచాయతీ ఎన్నికలు అంటే వైసీపీ పారిపోతుందని, నిష్పాక్షిక ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయం వారికి పట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. జగన్ రెడ్డి వేధింపులు బెదిరింపులు కక్షసాధింపు చర్య పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన ఇంకా కొద్ది రోజులు పోతే అందరూ ఛీ కొట్టే పరిస్థితి వస్తుందని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజల్లో అశాంతి, అభద్రత నెలకొందని సీఎం జగన్ ఇంటిని ముట్టడించిన వారిపై అత్యాచారయత్నం కేసు పెట్టడం సిగ్గుచేటని చంద్రబాబు మండిపడ్డారు.
నామినేషన్లపై టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్దేశం
శాసనమండలిని రద్దు చేయడం ఎన్నికల సంఘం పై, న్యాయ వ్యవస్థల పై దాడి చేయడం, ఎన్నికల కమిషనర్ ను దుర్భాషలాడటం, మీడియా పైన అణచివేత రాజ్యాంగబద్దంగా పదవి చేపట్టిన వారు చేయవలసిన చర్యలు కాదంటూ చంద్రబాబు జగన్ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో నామినేషన్లు స్వీకరించని చోట అధికారులపై ఫిర్యాదు చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసిపి దుర్మార్గాలపై రాజీలేని పోరాటం చేయాలని పేర్కొన్న చంద్రబాబు రాజ్యాంగాన్ని గౌరవించడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు.
నామినేషన్లు తీసుకోని వారిపై ఆధారాలతో ఫిర్యాదులు చెయ్యండి
వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా వైయస్ జగన్ ధోరణి ఉందని చంద్రబాబు మండిపడ్డారు. నామినేషన్లు తీసుకోని చోట ఏం జరిగిందో తగిన ఆధారాలతో, ఫోటోలు వీడియో సాక్ష్యాలతో అధికారుల పై ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు జిల్లా పంచాయతీ అధికారి కి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనని అధికారుల తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అధికారులు సహాయ నిరాకరణ, గైర్హాజరు వంటి చర్యల పై గవర్నర్ కు, హైకోర్టు సీజే కు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు.