వైసీపీ ఎంపీ ప్రాణాలకే రక్షణ లేదు.. ప్రభుత్వ దౌర్జన్యాలు కేంద్ర మంత్రే చెప్పారు : చంద్రబాబు ఫైర్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు . కరోనా సంక్షోభ సమయంలో కూడా వైసీపీ నేతల కుంభకోణాలు దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్సుల వ్యవహారంలోనూ 408 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడడం దారుణమని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.
అంబులెన్స్ ల కాంట్రాక్టులో అవినీతి
అంబులెన్స్ ల కాంట్రాక్టును విజయసాయిరెడ్డి అల్లుడుకు కట్టబెట్టారని ఆరోపించిన చంద్రబాబు అవినీతిపై ప్రశ్నిస్తే వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, కేసులు పెట్టి వేధిస్తున్నారని,అధికారపార్టీ నేతలు దాడులు,దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు అని పేర్కొన్నారు చంద్రబాబు.ఇక అంతే కాదు సరస్వతి పవర్ కు నీళ్లు, గనుల కేటాయింపును ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ఎంపీ ప్రాణాలకే రాష్ట్రంలో భద్రత లేదు
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ ఎంపీ ప్రాణాలకే రాష్ట్రంలో భద్రత లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకే తనకు ముప్పు ఉందని,బెదిరిస్తున్నారని స్పీకర్ కు లేఖ రాయడం ఏపీలో పరిపాలనకు పరాకాష్ఠ అని చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ సానుభూతిపరుల అరెస్ట్ లు దారుణం
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని దళిత యువకులు అరెస్టు చేశారని, తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న వారిని అరెస్టు చేయడం దారుణమని, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.ఇక అంతేకాదు చట్టవ్యతిరేక, కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన సాగించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
కుంభకోణాలు చేస్తుంది వైసీపీనే
కుంభకోణానికి పాల్పడేందుకు ఇళ్ల స్థలాల మీద శ్రద్ధ పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. తూర్పుగోదావరిలో లేటరేట్, అరకు ఏజెన్సీలో గ్రానైట్ అక్రమ రవాణా విషయంలో వైసిపి నేతల హస్తం ఉందని వార్తలు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ప్రబలుతున్న పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని వైసిపి ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. సీఎం కుటుంబానికి సంబంధించి ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న సరస్వతి పవర్ కు గనుల కేటాయింపు అధికార దుర్వినియోగానికి నిదర్శనం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.