మెట్రోపై చంద్రబాబు ఫోకస్: శ్రీధరన్కు విజ్ఞప్తి
హైదరాబాద్: విశాఖపట్టణం, విజయవాడలో మెట్రో రైలు పనులను జూన్ నాటికి ప్రారంభించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మెట్రో రైలు ప్రాజెక్టు ముఖ్య సలహాదారు శ్రీధరన్ శనివారం ముఖ్యమంత్రిని కలిశారు. మెట్రో ప్రాజెక్టు వాస్తవ పరిస్థితి వివరించారు.
విశాఖపట్టణం, విజయవాడ మెట్రోలపై సాధ్యాసాధ్యాల నివేదకలను మార్చిలోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. వచ్చే జూన్ నాటికి ఎట్టిపరిస్థితుల్లో పనులు ప్రారంభం కావాలని, తొలి దశ 2018 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జపాన్, సింగపూర్ పర్యటన విశేషాలు, అక్కడ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను చంద్రబాబు శ్రీధరన్కు వివరించారు.
తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి మధ్య రైల్వే కనెక్టివిటీపైనా నివేదిక ఇవ్వాలని కోరారు. 50 ఏళ్లకు సరిపోయేలా మౌలిక వసతులు కల్పించుకోవాలని, అందుకు తగ్గట్టు ప్రణాళికలు ఉండాలని సూచించారు. మెట్రో ప్రాజెక్టులకు అవసరమయ్యే ఆర్ధిక వనరుల సమీకరణపై ఇరువురూ చర్చించారు.
స్మార్టు ఆంధ్రప్రదేశ్కు జనవరి 1న శ్రీకారం చుడతామని చంద్రబాబు ప్రస్తావించారు. విశాఖ మెట్రోతో పాటు విజయవాడ-గుంటూరు- తెనాలి -మంగళగిరి మెట్రో రైలు ప్రాజెక్టుల పూర్తికి మూడున్నరేళ్లు పడుతుందని అధికారులు చెప్పారని తెలుస్తోంది.
ఇప్పటికే శ్రీధరన్ ఇరు ప్రాజెక్టులను అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలతోపాటు ఇబ్బందులను కూడా ముఖ్యమంత్రికి వివరించారు. వీజీటీఎంలో నాలుగు కారిడార్లు ఉంటాయని, దాదాపు 50 కిలోమీటర్లు మేర మెట్రో నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే వైజాగ్లో దాదాపు 40 కిలోమీటర్లు మేర మెట్రో నిర్మించాల్సి ఉంటుందని వివరించారు.
రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇప్పటికే ప్రభుత్వం ఎస్పీవి (స్పెషల్ పర్పజ్ వెహికిల్స్)లను నియమించింది. వీటికి బోర్డుతోపాటు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించే వీలు కలిగింది.
వైజాగ్లో ఎన్ఎడి జంక్షన్ నుండి మద్దిల పాలెం వరకూ 11 కిలోమీటర్లు, ఎన్ఎడి జంక్షన్ నుండి గాజువాక వరకూ 14 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుండి గాజువాక వరకూ 14 కిలోమీటర్లు మేర మెట్రో నిర్మిస్తారు. విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ పైన శ్రీధరన్ బృందంతో చంద్రబాబు చర్చించారు.