సీమపై చంద్రబాబు ఫోకస్- జగన్ కోటల్లో మారుతున్న సమీకరణాలు- ఇప్పుడు వదులుకుంటే..
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్ని వైసీపీ దాదాపు ఊడ్చేసింది. కేవలం కుప్పం, ఉరవకొండ, హిందూపురం మినహా మిగిలిన అన్ని చోట్లా గెలిచిన వైసీపీకి ఇప్పుడు పరిస్ధితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా రాయలసీమ ప్రాంతంలో గత విజయాల్ని పునరావృతం చేసుకోవడంలో విఫలమైతే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు తప్పవు.ఇప్పుడు అదే పరిస్దితిని సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. ఓ దశలో కుప్పం కూడా కోల్పోతామన్న భయం నుంచి మిగతా చోట్ల ఫోకస్ పెట్టే స్ధాయికి వచ్చారు.
Recommended Video
రాయలసీమపై చంద్రబాబు ఫోకస్
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒకప్పుడు రాయలసీమ జిల్లాల్లో కడప మినహా మిగిలినవి కంచుకోటలుగా ఉండేవి. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో ఉన్న బీసీ జనాభా టీడీపీకి పూర్తిగా అండగా నిలిచేది. 2014 వరకూ ఇదే పరిస్ధితి. 2014 ఎన్నికల్లో టీడీపీ ఈ రెండు జిల్లాల్లో సాధించిన సీట్లు కచ్చితంగా వైసీపీకి రాష్ట్రంలో అధికారానికి దూరం చేశాయన్నవాదన కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో బీసీలపై ఫోకస్ పెట్టిన వైసీపీ.. 2019 నాటికల్లా ఈ జిల్లాల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసి అధికారం చేపట్టే స్ధాయికి చేరుకుంది. దీంతో టీడీపీ కంచుకోటలు కాస్తా కకావికలు అయ్యాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వాటిపై దృష్టిపెడుతున్నారు. అదే సమయంలో కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తామని చెప్పుకున్న టీడీపీ.. చివరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ ను రంగంలోకి దింపుతోంది. దీంతో ఆయన ఏ మేరకు చంద్రబాబుకు పోటీ ఇస్తారన్నది ప్రశ్నార్ధకమే. అదే సమయంలో మిగిలిన రాయలసీమ జిల్లాల్లోనూ జిల్లాల విభజనతో మారుతున్న పరిస్దితుల్ని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ గ్రూపు పాలిటిక్స్
ప్రస్తుతం కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమ ప్రాంతంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగన్ పాటిస్తున్న సామాజిక సమీకరణాలకు తోడు స్ధానికంగా పెరుగుతున్న ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా వైసీపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.అంతెందుకు స్వయంగా సీఎం జగన్ సొంతజిల్లా కడపలో సైతం వైసీపీ గ్రూపు రాజకీయాలు, వారిపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఇదే అదనుగా చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. వైసీపీలో గ్రూపు తగాదాల్ని సొమ్ముచేసుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతున్నారు.
సీమలో మారుతున్న సమీకరణాలు
రాయలసీమలో మారుతున్న పరిణామాలతో హ్యాపీగా ఉన్న చంద్రబాబు.. మరోసారి తన పాత కంచుకోటలపై దృష్టిపెట్టారు. రాయలసీమ జిల్లాల్లో వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ ఇన్ ఛార్జ్ లను నియమించి వారితో పాత రాజకీయానికి పదునుపెడుతున్నారు. గతంలో తాము గెలిచిన హిందూపురం, కుప్పం, ఉరవకొండ వంటి చోట్ల వైసీపీ ఎంట్రీకి పరిస్ధితులు ఇప్పటికీ అనుకూలంగా లేవని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో వీటిని కాపాడుకుంటూనే వైసీపీ గెలిచిన సీట్లపై ఫోకస్ పెడుతున్నారు. గతంలోలా జగన్ హవా ఉండబోదని అంచనా వేస్తున్న చంద్రబాబు రాయలసీమలో చేపడుతున్న పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది.
చంద్రబాబుకు టూర్లకు భారీస్పందన
రాయలసీమ జిల్లాల్లో మూడేళ్ల క్రితం చంద్రబాబుపై కనిపించిన వ్యతిరేకత ఇప్పుడు లేదు. అలాగే బీసీల్లో గతంలో జగన్ కు వచ్చిన ఆదరణ ఇప్పుడు కనిపించడం లేదు. బీసీల్లో కొన్ని కులాలకే పదవులు కట్టబెట్టడం, నామినేషన్ పద్దతులో పనులివ్వడం, నామినేటెడ్ పదవులు ఇవ్వడం వంటి కారణాలు వారిలో అసంతృప్తి రాజేస్తున్నాయి. అదే సమయంలో జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల్లో లోటుపాట్లపై పెరుగుతున్న అసంతృప్తి కూడా టీడీపీకి కలిసివస్తోంది. దీంతో చంద్రబాబు టూర్లకు, సభలకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే దీన్ని టీడీపీ ఎంతమేరకు సొమ్ము చేసుకుంటుందన్న దానిపై వచ్చే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి.