'జగన్ చెప్పినట్లుగా వింటున్న చంద్రబాబు, రేపు టీడీపీ ఎంపీల రాజీనామా చేయొచ్చు!'
అమరావతి/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ ఎంపీలు ప్రధాని ఇంటిముందు నిరసన వ్యక్తం చేయడం చవకబారు రాజకీయం అని విశాఖ ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు ఆదివారం అన్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాన పార్టీలు ఏవీ పాల్గొనలేదన్నారు.
చదవండి: మోడీ నా జూనియరైనా సార్ సార్ అన్నాను: బాబు, పవన్! నీకు అలవాటేమో, అవమానిస్తావా: శివాజీ షాక్
అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయన్నారు. కమిటీల ద్వారా ఉద్యమాన్ని నిర్వహిస్తారని, ఆ ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని చెప్పడం సరికాదన్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందనే వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.
చదవండి: టీడీపీ ఎంపీల కోసం ఢిల్లీ పోలీస్ స్టేషన్కు కేజ్రీవాల్, మోడీపై తీవ్ర ఆగ్రహం
అరెస్టు చేస్తారని తెలిసి ఆందోళన
ఏపీ ప్రభుత్వం నిస్సహాయంగా ఉన్నట్లుగా ఉందని హరిబాబు అన్నారు. ప్రధాని మోడీ నివాసం ఎదుట టీడీపీ ఎంపీల ఆందోళన వింతగా ఉందన్నారు. ప్రధాని నివాసం ఎదుట ఆందోళన చేస్తే పోలీసులు అరెస్టు చేస్తారని తెలిసి, ముట్టడి పేరుతో ఆందోళన చేసి పోలీసులు అరెస్టు చేశారని గగ్గోలు పెట్టడం చవకబారుతనమన్నారు.
ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం
టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకే ఆందోళనలు చేస్తున్నారని హరిబాబు మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలకు హోదా ఉంటే ఏవిధమైన ఆర్థిక ప్రయోజనం ఉంటుందో అదే ఆర్థిక ప్రయోజనాన్ని అయిదు సంవత్సరాల పాటు ఏపీకి ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ ఆందోళనలు అర్థరహితమన్నారు.
చేసిన సాయం చెబుతుంటే దాడి అంటారా?
నేనే ఏపీ.. ఏపీ అంటే నేనే అనేలా చంద్రబాబు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని హరిబాబు అన్నారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, అంతకుమించి ఏమీ ఉండదన్నారు. కేంద్రం చేసిన సాయాన్ని చెబుతుంటే దాడి చేస్తున్నారని చంద్రబాబు అనడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. వారిది ఆల్ పార్టీ మీటింగ్ కాదని ఆల్ యువర్ పార్టీ మీటింగ్ అన్నారు.
వైసీపీ ఉచ్చులో చంద్రబాబు
కేంద్రం సాయాన్ని చంద్రబాబు గుర్తించకపోవడం బాధాకరమని హరిబాబు అన్నారు. ప్యాకేజీకి అంగీకరించింది, ఏడాదిన్నర తర్వాత స్వరం మార్చడం సరికాదన్నారు. వైసీపీ ఉచ్చులో తెలుగుదేశం పార్టీ పడినట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పి, ఇప్పుడు ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా రాజకీయ లబ్ధి కోసం మళ్లీ హోదా అనడం ఎంతవరకు సమంజసం అన్నారు.
జగన్ చెప్పినట్లుగా చేసిన చంద్రబాబు!
ఇటీవల విశాఖ ఐఐఎం రెండో స్నాతకోత్సవంలో చంద్రబాబు పాల్గొని పట్టాలు ఇచ్చారని, కేంద్ర విద్యా సంస్థలు పని చేస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని హరిబాబు నిలదీశారు. బీజేపీ, టీడీపీ విడిపోవాలని వైసీపీ ఆశించిందని, కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావాలని ఆశించిందని, అలాగే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేసిందని, వైసీపీ లేదా జగన్ ఏం చెప్పారో టీడీపీ అదేవిధంగా చేసిందని మండిపడ్డారు.
వైసీపీ డిమాండ్.. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయొచ్చు
టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని వైసీపీ పదేపదే డిమాండ్ చేస్తోందని, ఈ ఒత్తిడిలో టీడీపీ ఎంపీలు రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదని హరిబాబు అన్నారు. కేంద్రం సాయం చేసింది టీడీపీకి కాదని, ఏపీ ప్రజలకు అన్నారు. భవిష్యత్తులో టీడీపీ.. బీజేపీకి మద్దతిచ్చినా ఇవ్వకున్నా ఏపీకి కేంద్రం నిరంతరం సాయం చేస్తూనే ఉంటుందన్నారు.
పీఎంవోలో టీ తాగితే హోదా రాదు
పగలు రాజీనామాలు చేసి, సాయంత్రం పీఎంఓలో టీ తాగితే హోదా రాదని వైసీపీని ఉద్దేశించి టీడీపీ నేత కళా వెంకట్రావు వేరుగా మండిపడ్డారు. విభజన హామీలు నెరవేర్చాల్సిందే అన్నారు. హోదా ఇవ్వాల్సిందే అన్నారు. నాలుగేళ్లుగా 29సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగామని, తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తమ ఎంపీలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. పార్లమెంట్లో ప్రధాని మోడీ విఫలమైనందునే ఆయన ఇంటిని ముట్టడించామన్నారు. బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తోందని, అందుకే వందమంది ఎంపీలు తమతో కలిసి వచ్చారన్నారు. హోదా సాధించేందుకు ఎలాంటి ఉద్యమానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.