ఆయన పోటీ చెయ్యనన్నా చంద్రబాబే బలవంతం చేశారట .. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్
విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు పోటీ చేయడం ఇష్టం లేదని, పార్టీ అధినేత చంద్రబాబు తనను పోటీ చెయ్యాలని బలవంతం చెయ్యటం వల్లే పోటీ చేశానని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు . ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీచేసి అయ్యన్నపాత్రుడు ఓటమి పాలయ్యారు.
కేసీఆర్ కన్నా జగన్ బెటర్ అంటున్న మందా కృష్ణ మాదిగ.. ఎందుకో రీజన్ కూడా చెప్పారుగా
ఎన్నికల్లో గెలుపోటములు సహజం .. నిరాశ వద్దన్న అయ్యన్న పాత్రుడు
గడచిన ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ ఇప్పుడిప్పుడే దిద్దుబాటు చర్యలు ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో అనకాపల్లిలోని కొణతాల రామకృష్ణ కళ్యాణ మండపంలో పార్టీ నియోజక వర్గ విస్తృత సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు తనదైన శైలిలో మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్న ఆయన ఇప్పుడు టీడీపీని బలోపేతం చెయ్యటంపై అందరూ దృష్టి సారించాలని పేర్కొన్నారు. . తొమ్మిది సార్లు పోటీ చేసిన తనను ఓటర్లు మూడుసార్లు ఓడించారన్నారు. ఇక ఓటమి ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వారికే తప్పలేదని చెప్పారు .
టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చే వరకు విశ్రమించనన్న అయ్యన్న
ఓటమితో క్రుంగిపోవాల్సిన అవసరం లేదని మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావటానికి అందరూ కృషి చెయ్యాలని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలైనా ప్రజలు మార్పుకోరుకున్నారని తెలిపారు.ప్రస్తుతం తాను ఓటమి గురించి ఆలోచించడం లేదని, మళ్లీ టీడీపీని అధికారంలోకి తెచ్చే వరకు విశ్రమించనని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. గెలిస్తే పింఛన్ మొత్తం రూ.3 వేలు చేస్తానన్న జగన్ మాటతప్పి రూ.250లు మాత్రమే పెంచారన్నారు. ఇక వైసీపీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని ఆయన విమర్శించారు.అమ్మ ఒడి పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఆ డబ్బు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని కోరారు. రైతులకు రూ.15 వేల సాయం అందించేందుకు టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేస్తే జగన్మోహన్రెడ్డి రూ.12,500 మాత్రమే ఇస్తున్నారని అయ్యన్న పేర్కొన్నారు .
టీడీపీపై జరిగే దాడులను ఎదుర్కొందామని పార్టీ శ్రేణులకు పిలుపు
టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చెయ్యాలని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు అనే మాటలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న ఆయన టీడీపీ పునాదులు కదిపే శక్తి ఎవరికి లేదని ఆయన గట్టిగా చెప్పారు . టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అంతే కాదు టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పని చెయ్యాలని , నిరుత్సాహం వద్దని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఎవరూ వైసీపీ గురించి ఆరునెలల పాటు మాట్లాడవద్దని , పాలన బాగోకుంటే ఏం చెయ్యాలో ప్రజలే నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులు, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నాయని, దీన్ని ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన స్పష్టం చేశారు.