కాంగ్రెస్పై బాబు నిప్పులు: ఇబ్బందిపడ్డ గల్లా, మౌనమే
హైదరాబాద్/చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి ఆదివారం చిత్తూరు జిల్లాలో ఒకే వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. వారిద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. బంగారుపాళ్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు, చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యుడైన దివంగత ఎన్పి చెంగల్రాయనాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ వేదిక నుండి గల్లా ముందే బాబు కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రులు చిదంబరం, వీరప్ప మొయిలీల పైన మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేని నేతలు కీలకంగా వ్యవహరించారని విమర్శించారు. ఆ సమయంలో గల్లా అరుణ కుమారి కొంత ఇబ్బంది పడ్డారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి పోటీపడుతున్న కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేద్దామంటూ చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. మరో 90 రోజుల్లో దేశంలో, రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీరిపోతాయన్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉందన్నారు.
జాబ్ రావాలంటే బాబు రావాల్సిందేనని ఇప్పటికే యువత భావిస్తోందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలొచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద నెలనెలా రెండు వేల రూపాయలు యువతకు అందజేస్తామన్నారు. తానుకూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానని, తనకు వ్యవసాయదారుల కష్టాలు బాగా తెలుసునన్నారు. మరోవైపు గల్లా అరుణ కుమారి తన ప్రసంగంలో చెంగల్రాయుడు సేవలను కీర్తించారు. ఇతర అంశాల జోలికి వెళ్లలేదు.