చంద్రబాబు వద్ద పెరిగిన బాషా పలుకుబడి: భవిష్యత్తే మరి...
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున కదిరి నియోజకవర్గం నుంచి శానససభకు గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన చాంద్ బాషా పలుకువడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వద్ద, అనంతపురం జిల్లా మంత్రి పరిటాల సునీత వద్ద బాగానే పెరిగిందని అంటున్నారు. అయితే, కదిరి నియోజకవర్గం టిడిపి ఇంచార్జీ కందికుంట వెంకటప్రసాద్తో మాత్రం చిక్కులు తప్పడం లేదు.
చాంద్ బాషా చేరిన తర్వాత టిడిపిలోని ఇరు వర్గాలు కదిరి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. కందికుంట వెంకట ప్రసాద్ వర్గం ఎప్పటికప్పుడు బాషాకు చిక్కులు తెచ్చి పెడుతోంది. దీన్ని ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దీనివల్ల చాంద్ బాషా భవిష్యత్తు ఏమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇటీవల కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా కందికుంట వర్గానికి చెందిన రామకృష్ణారెడ్డి పేరును టిడిపి నాయకత్వం ఖరారు చేిసంది. దాంతో స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద ఆయన ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లుచేశారు. చాంద్ బాషాను మాత్రం ఆహ్వానించలేదు. దీంతో బాషా మనస్తాపానికి గురై పార్టీ జిల్లా అధ్యక్షుడికీ, రాష్ట్ర అధిష్టానానికీ విషయాన్ని తెలియజేశారని అంటున్నారు.
ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. మార్కెట్ కమిటీ చైర్మన్తోపాటు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథితో పాటు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ స్వయంగా ఈ వాయిదా ప్రకటన చేశారు.
దాంతో కదిరి నియోజకవర్గంలో బాషా పలుకుబడి పెరిగిందని అంటున్నారు. విజయవాడలో ఇటీవల ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో చాంద్ బాషాకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని చెబుతున్నారు. అంతేకాకుండా మంత్రి పరిటాల సునీత చాంద్ బాషాను తన ఇంటికి ఆహ్వానించి రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
కాగా, కదిరిలో చాంద్ బాషాకు, కందికుంటకు మధ్య వైరం వీధికెక్కుతూనే ఉంది. కదిరిలోని వలీసాబ్ వీధిలో ఉన్న చాంద్ బాషాకు చెందిన వస్త్ర దుకాణం పక్కనే కందికుంట వర్గానికి చెందిన ఒక నాయకుడి వస్త్ర దుకాణం కూడా ఉంది. సాయంత్రం వేళ షాపుల ఎదుట బోర్టులు పెట్టుకునే విషయంలో చాంద్ బాషా, కందికుంట వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
కదిరి డీఎస్పీ రామాంజనేయులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. కానీ ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత కందికుంట వర్గీయులు పెద్దఎత్తున వచ్చి తగాదాకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి రాత్రంతా పట్టణంలో 144 సెక్షన్ విధించారు.