అనురాధకు బాబు షాక్: జాబితా నుంచి పేరు తొలగింపు
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో రెండేళ్ల పదవీకాలానికి మాత్రమే పరిమితమయ్యే ఎమ్మెల్సీ పదవికి అంగీకరించడానికి నిరాకరించిన పంచుమర్తి అనురాధకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి రూపొందించిన జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు.
తనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కావాలని పట్టుబడుతూ వచ్చిన అనురాధ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆమె వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమెపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అనురాధ స్థానంలో బీద రవిచంద్ర యాదవ్కు జాబితాలో చోటు దక్కింది. గవర్నర్ కోటా కింద తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాలుగు పేర్లను ఖరారు చేసింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడి జనార్దన్, శ్రీనివాసులు, బీద రవిచంద్ర యాదవ్ గవర్నర్ కోటా కింద ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి వెళ్లనున్నారు.
గవర్నర్ కోటాలో నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరికి స్థానం దక్కింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడే కాకుండా తెలుగుదేశం పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తూ వస్తున్నారు. ఆయన విధేయతే ఆయనకు పదవిని కట్టబెట్టింది.