'చంద్రబాబుకు గుండు సున్నా' ; ఆంధ్రా వద్దు, తెలంగాణే కావాలంటున్న ఐపీఎస్ లు
చిత్తూరు : గడగడపకు వైసీపీ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు 100 ప్రశ్నలు సంధిస్తోన్న వైసీపీ.. చంద్రబాబుకు గుండు సున్నా మార్కులే వస్తున్నాయని ఎద్దేవా చేస్తోంది. తాజాగా గడపగడపకు వైసీపీ పై స్పందించిన పుంగనూరు వైసీపీ ఎమ్యెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబు పాలనపై జనంలో వైసీపీ సంధించిన ప్రశ్నలకు జీరో మార్కులే వచ్చాయని వెల్లడించారు.
బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణా పుష్కరాల పేరిట చంద్రబాబు చందాల వసూలుకు సిద్దపడడం ఆయన దిగుజారుడుతనానికి నిదర్శనం అని విమర్శించారు. కృష్ణా పుష్కరాల పనుల నేపథ్యంలో ప్రభుత్వ ఆలయాల కూల్చితలను ప్రస్తావించిన పెద్దిరెడ్డి, పుష్కరాలను అడ్డు పెట్టుకుని 30 దేవాలయాలను కూల్చివేసిన ఘనుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా చంద్రబాబు తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు పెద్దిరెడ్డి.
ఆంధ్రా వద్దు, తెలంగాణే కావాలంటున్న ఐపీఎస్ అధికారులు :
తమను ఏపీకి కేటాయించవద్దని, తెలంగాణలోనే పనిచేస్తామని ఇద్దరు ఐపీఎస్ అధికారులు క్యాట్ (కామన్ అపిలేట్ ట్రైబ్యునల్) లో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్ అధికారులు అమిత్ గార్గ్, హరీశ్ కుమార్ గుప్తాలు ఈ పిటిషన్ దాఖలు చేయగా.. క్యాట్ విచారణకు స్వీకరించింది.
దీంతో ఐపీఎస్ ల నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. అటు కేంద్రం, ఇటు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన క్యాట్ సమాధానం చెప్పాలని కోరింది. కాగా, పిటిషన్ విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది క్యాట్. అయితే ఇద్దరు ఐపీఎస్ లు ఆంధ్రాలో పోస్టింగ్ ఎందుకు వద్దారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఐపీఎస్ అమిత్ గార్గ్ మాత్రం తాను తెలంగాణలోనే కొనసాగుతానని, ఆంధ్రాకు వెళ్లనని గతంలో ప్రకటించారు. అయితే అధికారుల విభజనలో భాగంగా ఆయన్ను ఆంధ్రాకే కేటాయించడంతో.. తిరిగి తెలంగాణ వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అమిత్ గార్గ్.