టార్గెట్ బెగ్గర్స్ : బెజవాడలో కనిపించొద్దని ఏపీ సర్కార్ హుకుం
హైదరాబాద్ : బెగ్గర్స్ ను మరోసారి నగరం దాటిచ్చే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కార్. కృష్ణ పుష్కరాల నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే భక్తులకు బిచ్చగాళ్ల బెడద లేకుండా చేయాలనే ఉద్దేశంతో నగరం నుంచి 12 రోజుల పాటు బెగ్గర్స్ పై నిషేధం విధిస్తూ హుకుం జారీ చేసింది.
గత గోదావరి పుష్కరాల సమయంలోను రాజమండ్రిలోని బెగ్గర్స్ పై నిషేధం విధించింది ప్రభుత్వం. ఆ సమయంలో పరిహారం కింద ఒక్కో బెగ్గర్ కు రూ.10000 వేల దాకా ప్రభుత్వం ముట్టజెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని మెచ్చని బెగ్గర్స్.. తమ సంపాదన అంతకంటే ఎక్కువే ఉంటుందని అప్పట్లో అధికారులతో పేచీకి కూడా దిగినట్టు తెలుస్తోంది. అయితే రంగంలోకి దిగిన హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ మొత్తానికి గొడవను ఎలాగోలా సద్దుమణిగించి బెగ్గర్స్ ను రాజమండ్రి విడిచి వెళ్లేలా చేశారు.
ఇక తాజా పుష్కరాల నేపథ్యంలో ఇప్పటికే బెగ్గర్స్ జాబితాను తయారుచేసిన అధికారులు వారిని విజయవాడ నుంచి బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఇందుకోసం పరిహారం కింద ఒక్కో బెగ్గర్ కు రూ.5000 వేల వరకు ప్రభుత్వం ముట్టజెపుతున్నట్టు సమాచారం. బెగ్గర్స్ ను తరలించే బాధ్యతను జిల్లా ఉన్నత అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదిలా ఉంటే, బిచ్చగాళ్ల నిషేధంపై స్పందించిన ఓ అధికారి.. 'బెగ్గర్స్ నగరంలో ఉంటే పుష్కరాలకు వచ్చే భక్తుల కాళ్లకు అడ్డంపడి ఇబ్బందులు తీసుకొస్తారని, భక్తుల సౌకర్యం మేరకు వారిని నగరం నుంచి తరలిస్తున్నట్టుగా' చెప్పుకొచ్చారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే.. గతంలో చంద్రబాబు సీఎంగా చేసిన తొమ్మిది కాలంలోను బెగ్గర్స్ ను నిషేధించిన సందర్బాలున్నాయి. అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్బంలో నగరంలోని బెగ్గర్స్ అందరిని శివారు ప్రాంతాలకు తరలించేశారు చంద్రబాబు. దీంతో బెగ్గర్స్ అంటే చంద్రబాబుకు అస్సలు సహించదన్న అభిప్రాయం కూడా జనాల్లో ఏర్పడింది.