చంద్రబాబుకు ముస్లింల ఓట్లు అడిగే హక్కు పోయింది:వైసిపి నేత అంబటి రాంబాబు;గుడ్డలూడదీసి కొట్టారు
గుంటూరు:గుంటూరులో జరిగిన 'నారా హమారా...టీడీపీ హమారా' సభలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులను అక్రమంగా అరెస్టు చేయించడం అమానుషమని టిడిపి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.
ముస్లిం యువకుల అక్రమ అరెస్టులకు నిరసనగా గుంటూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముస్లిం సంఘాలు,ప్రజాసంఘాలతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపి నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ ఘటనతో చంద్రబాబుకు ముస్లింల ఓట్లు అడిగే హక్కు పూర్తిగా పోయిందని, ఆయన హయాంలో ముస్లింలకు రక్షణ కరువైందని దుయ్యబట్టారు.
వైసిపి అండ
ముస్లిం సోదరులు అధైర్యపడవద్దని మీకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అంబటి రాంబాబు భరోసా ఇచ్చారు. ముస్లింలు తమ డిమాండ్ల గురించి ప్రశ్నిస్తే వాటి గురించి చర్చించడం పోయి అణగదొక్కే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పతనంతోనే ముస్లింలకు మేలు జరుగుతుందని అంబటి రాంబాబు చెప్పారు.
తొలి కేబినెట్
గతంలో ఎప్పుడైనా ముస్లింలు లేని కేబినెట్ చూశామా అంటూ అంబటి రాంబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ముస్లింలను కేబినెట్లోకి తీసుకోరు కానీ, ఆయన కొడుకు లోకేష్ను మాత్రం తీసుకుంటారని విమర్శించారు. అసలు ముస్లింల అభివృద్ది గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
కొట్టారు
అనంతరం సభలో నిరసన తెలిపినందుకు అరెస్టయిన ముస్లిం యువకులు మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం బెయిల్పై విడుదలైన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా ఫ్లకార్డులతో నిరసన తెలిపిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ముస్లింలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రశ్నించినందుకు తమను అరెస్టు చేశారన్నారు. పోలీసులు తమను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బట్టలూడదీసి కొట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సంఘటనతో ముస్లింల పట్ల చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకత బైటపడిందన్నారు.
చంద్రబాబు ఓటమిలో...పాలుపంచుకుంటారు
అనంతరం వైఎస్సార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హబీబుల్లా మాట్లాడుతూ నాలుగేళ్లుగా ముస్లింలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ముస్లిం యువకులు హామీల గురించి అడిగితే దేశద్రోహం కేసులు పెట్టడం దారుణమన్నారు. ముస్లింలను టీడీపీ ప్రభుత్వం అన్నివిధాలుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని...అందుకు ప్రతిగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిలో ముస్లింలు పాలుపంచుకుంటారని చెప్పారు. ముస్లిం యువకులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని వైసిపి మరో నేత శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు.