'జగన్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు భారీ కుట్రలు, అవినీతిపై దండయాత్ర'
చిత్తూరు/గుంటూరు: తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం ఆరోపించారు. గతంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో కలిసి జగన్ పైన కేసులు పెట్టించారని మండిపడ్డారు.
చంద్రబాబు అవినీతిపై జగన్ దండయాత్ర
చంద్రబాబు అవినీతిపై జగన్ దండయాత్ర చేస్తున్నారన్నారు. జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు భారీ కుట్రలు చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. మరోవైపు, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వైసీపీ నేతల గృహ నిర్బంధంపై ఆ పార్టీ నేతలు అంబటి, ఉమ్మారెడ్డి తదితరులు మాట్లాడారు.
నిజాలు ప్రజలకు తెలియకుండా
నిజ నిర్ధారణ కమిటీ గురజాల వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. నిజాలకు టీడీపీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. నిజం అంటే చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు. అక్రమ మైనింగ్ పైన నిజాలు ప్రజలకు తెలియాలని, నిజ నిర్ధారణ కమిటీ పర్యటన అంటే ఎందుకు అంత భయమని వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ సీనియర్లతో కలిసి అక్రమ క్వారీలను పరిశీలిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు.
ఎవరికైనా శిక్ష పడాల్సిందే
అక్రమ మైనింగ్ కేసును తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని, గతంలో అక్రమ మైనింగ్ పైన పలుమార్లు ఫిర్యాదు చేశామని అంబటి రాంబాబు అన్నారు. అక్రమ మైనింగ్కు పాల్పడ్డవారు ఎవరైనా శిక్షపడాల్సిందే అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేరస్తులను శిక్షించడానికి పోలీసులు పని చేయాలని హితవు పలికారు. నిజ నిర్ధారణ కమిటీని అడ్డుపెట్టుకోవడం సరికాదన్నారు.
చంద్రబాబు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు
సీఎం చంద్రబాబే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అక్రమ మైనింగ్ పైన వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భారీస్థాయిలో అక్రమాలు జరిగాయని రిపోర్టు ఇచ్చిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేనిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని అరెస్టులు చేసినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు.