అంగన్వాడీలకు వరాలు: నేను తగ్గను... కాల్ మనీపై సభలో బాబు ప్రకటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగన్వాడీలకు వరాలు ఇచ్చారు. శుక్రవారం నాడు శాసన సభలో చంద్రబాబు అంగన్వాడీలకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. ఈ పెంపు సందర్భంగా ప్రభుత్వం పైన భారం పడనుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విజయవాడలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తమకు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీ విషయమై చంద్రబాబు పోలీసులకు సూచనలు చేశారు. అంగన్వాడీల పైన లాఠీచార్జ్ చేయవద్దని పోలీసులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారిని అదుపు చేయాలని చెప్పారు. అంగన్వాడీలు సంయమనం పాటించాలని చంద్రబాబు కోరారు.
అదే సమయంలో, శాసన సభలో అంగన్వాడీల జీతాలు పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అంగన్వాడీల జీతాలను రూ.4,200 నుంచి రూ.7,500కు, అంగన్వాడీ హెల్పర్ల జీతాలు రూ.2,200 నుంచి రూ.4,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంత్రివర్గ ఉప సంఘం వేతనాలు పెంచాలని నివేదిక ఇచ్చిందన్నారు.
అంగన్వాడీలు పేద పిల్లల కోసం పని చేస్తున్నారని చంద్రబాబు కితాబిచ్చారు. అంగన్వాడీలకు పెంచిన జీతాలు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ జీతాలు పెంచడం ద్వారా ప్రభుత్వం పైన రూ.311.12 కోట్ల భారం పడుతుందని చెప్పారు.
అనంతరం శాసన సభ పదిహేను నిమిషాలు వాయిదా పడింది. అంతకుముందు అంబేడ్కర్ పైన చర్చ ముగిసింది. ఆ తర్వాత అంగన్వాడీల వేతనాల పెంపుపై ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. తర్వాత స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు.
కాల్ మనీపై చంద్రబాబు ప్రకటన
అనంతరం శాసన సభ తిరిగి ప్రారంభమైంది. టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలు సభలోకి వచ్చారు. చంద్రబాబు కాల్ మనీ వ్యవహారంపై చంద్రబాబు ప్రకటన చేశారు. కాల్ మనీ కేసులో ఏ పార్టీకి చెందని వారు 70 మంది ఉన్నారన్నారు.
కాల్ మనీ కేసులో వైసిపి వారు 65 మంది, టిడిపి వారు 20 మంది, కాంగ్రెస్ వారు 12 మంది, సిపిఎం వారు ఒకరు, సిపిఐ వారు ఆరుగురు, బిజెపి పార్టీ వారు నలుగురు, లోక్సత్తా వారు ఇద్దరు ఉన్నారని చంద్రబాబు చెప్పారు. విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాల్ మనీ కేసులో వైసిపి వారే ఎక్కువ ఉన్నారని, అందుకే తమ బాగోతం బయటపడుతుందని వైసిపి భయపడుతోందన్నారు. కాల్ మనీ కేసులో ఎవరు ఉన్నా తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను చిత్తశుద్ధితో ఈ ప్రకటన చేస్తున్నానని అన్నారు.
కాల్ మనీ కేసులో వ్యాపారులు వేధిస్తే బాధితులు ఫిర్యాదు చేయాలన్నారు. వడ్డీ వ్యాపారులు మహిళల పైన వేధింపులకు పాల్పడితే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా వదలమన్నారు. 227 కాల్ మనీ కేసులు నమోదయ్యాయని చెప్పారు. చంద్రబాబు ప్రకటన చేస్తున్న సమయంలో వైసిపి నేతలు డౌన్ డౌన్ అన్నారు. అప్పుడు చంద్రబాబు పదిమంది డౌన్ డౌన్ అంటే నేను తగ్గనన్నారు.