జగన్.. మీ ఇష్టం వచ్చినట్లేనా? ఆ మంత్రిని అరెస్ట్ చేయాలి: ఈసీనీ వదలని చంద్రబాబు
అమరావతి: ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరశైలిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇష్టం వచ్చినట్లుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టారీతిన రిజర్వేషన్లు, సరిహద్దులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈసీపై చంద్రబాబు ఫైర్..
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓటర్లను ప్రభావితం చేసే వాటన్నింటినీ తొలగించడం ఆనవాయితీ అని, అయితే, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ ఆ ప్రక్రియ చేపట్టలేదని చంద్రబాబు ఆరోపించారు. అంతేగాక, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చి ఇంట్లో కూర్చోవడంతో ఎన్నికల సంఘం పని అయిపోయినట్లు కాదని విమర్శించారు.
ఒక్క ఛాన్సిస్తే.. అంటూ హెచ్చరిక
మీ పార్టీ ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన రిజర్వేషన్లు మార్చేస్తారా? అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తమ అభ్యర్థులను జైళ్లలో పెట్టినా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇస్తే కండకావడం ప్రదర్శిస్తోందన్న చంద్రబాబు.. మరోసారి గెలిస్తే ఆస్తులు కూడా మిగలవని హెచ్చరించారు.
ఆ మంత్రిని జైల్లో పెట్టాలి..
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆయన మంత్రిగా కొనసాగడం సిగ్గుచేటని అన్నారు. 90 శాతం స్థానాలు గెలిపించుకోవడమంటే నిబంధనలు ఉల్లంఘించి కండకావరం ప్రదర్శించడమేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కోసం అంతా కలిసి రావాలన్నారు.
Recommended Video
ఓటమి భయంతోనే అక్కడ ఎన్నికలు పెట్టడం లేదు..
ఇది ఇలావుండగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు అల్లర్లు చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాజధాని కోసం 50 మంది రైతులు ప్రాణత్యాగం చేశారన్నారు. జగన్ సర్కారు 500 మంది రైతులను జైలుకు పంపిందని మండిపడ్డారు. విశాఖ ప్రజలు కూడా మోసపోవద్దని అన్నారు. 29 గ్రామాల ప్రజల కష్టం తీర్చలేని జగన్.. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారని అన్నారు. ఓటమి భయంతోనే రాజధాని గ్రామాల్లో ఎన్నికలు పెట్టడం లేదని ఆరోపించారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని లోకేష్ అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిపై చర్యలుంటాయని హెచ్చరించారు.