లూలూ ఔట్: చంద్రబాబు ఆవేదన, జగన్ సర్కారుపై సుజనా మండిపాటు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణం కోసం తాము చేసిన కృషినంతా బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ఆవేదన
ఎన్నో సంప్రదింపులు, నిరంతరం వెంటపడి లాలూ గ్రూప్ను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించామని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో విశాఖలో వేల ఉద్యోగాలు రావడంతోపాటు స్థానికంగా ఆర్థికాభివృద్ధి జరగేదని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తెలివితక్కువ నిర్ణయాలతో తమ శ్రమంతా వృథా అయ్యిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలివితక్కువ నిర్ణయాలతో..
వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న బాధ్యతలేని చర్యలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని దెబ్బతీశాయన్నారు. యువతకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు లూలూ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఈ మేరకు స్పందించారు.
అదే మా విధానం..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపైనా చంద్రబాబు స్పందించారు. తెలుగు మాధ్యమం కొనసాగిస్తూనే ఆంగ్ల బోధన ప్రవేశపెట్టాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే ఆంగ్ల మాధ్యమానికి కృషి చేసిందని గుర్తు చేశారు. మాతృ భాష తెలుగును కాపాడాలన్నదే టీడీపీ విధానమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మన భాష సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలుగు కావాలన్న చంద్రబాబు.. వృత్తిలో రాణించేందుకు ఇంగ్లీష్ అవసరమని అన్నారు. ఆంగ్ల మాధ్యమానికి టీడీపీ వ్యతిరేకమనే ప్రచారం సరికాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల రెండు నాల్కల దోరణిని ఎండగట్టాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఎటూ కాకుండా పోతారు..
ఇది ఇలావుండగా, ఆంగ్ల మాధ్యమంపై బీజేపీ సుజనా చౌదరి కూడా స్పందించారు. ఆంగ్ల మాధ్యమం వల్ల విద్యార్థులు అటు ఇటూ కాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఉపాధ్యాయులను సిద్ధం చేయకుండా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే స్పందన అంతగా రాదని, విద్యావేత్తలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. విభజన సమయంలో సమయంలో ఏపీపై రూ. లక్ష కోట్ల అప్పు ఉంటే.. గత ఐదేళ్లలో రూ. 2.50లక్షల కోట్లకు చేరిందని సుజనా తెలిపారు.
రాజు మారగానే రాజధాని మారుస్తారా?
గత ఆరు నెలల్లో ఎవరికైనా ఒక్క ఉద్యోగం వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి అడుగుతామని దాని గురించి కూడా మర్చిపోయారని వైసీపీపై మండిపడ్డారు. రాజు మారగానే రాజధాని మార్చడం సరికాదని అన్నారు.
వ్యక్తిగత కక్షసాధింపులపైనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపించారు. ఒక మతానికి ఎక్కువగా రాయితీలు ఇస్తే.. ప్రజల మధ్య మనస్పర్థలు వస్తాయని అన్నారు. మత సంబంధ సంస్థల నుంచి రాయితీలు ఇచ్చుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని.. కానీ ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వొద్దని సుజనా చౌదరి అన్నారు. టీటీడీ నిధులు ఇతర అవసరాలకు ఉపయోగించవద్దన్నారు.