కేసీఆర్ సహకారమేదీ? ఏపీని నాశనం చేస్తున్నారు: సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై అవగాహనలేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు విషయంలో సమస్య వస్తే కేంద్రంతో మాట్లాడకుండా బాధ్యతా రహితంగా లేఖ రాస్తారా? అని మండిపడ్డారు.
కేంద్రాన్ని అడగలేక.. టీడీపీపై దాడి చేస్తారా?
జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేకపోతే పూర్తిగా తెలుసుకోవాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాల విషయంలో జోక్యం చేసుకోవాలని, నిర్మాణం పూర్తి చేసేలా నిధులు ఇప్పించాలని కోరుతూ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పోలవరంపై కేంద్రంతో నేరుగా మాట్లాడకుండా టీడీపీపై ఎదురుదాడి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ అహంకారంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు..
సాగునీటి ప్రాజెక్టులపై తాను ఇచ్చిన సలహాలు జగన్ పెడచెవిన పెట్టారని చంద్రబాబు అన్నారు. అజ్ఞానం, గర్వం, అహంకారంతో రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్లా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారంతో ప్రాజెక్టులు కడతామని మొదట్లో జగన్ హడావుడి చేశారి.. ఇప్పుడేమో ఆ ఊసేలేదన్నారు. జగన్ తన మిడిమిడి జ్ఞానంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ప్రధానికి లేఖ రాసిన జగన్ చులకనయ్యారంటూ విమర్శించారు.
టీడీపీ హయాంలోనే పోలవరం 71 శాతం పూర్తి
టీడీపీ ప్రభుత్వ హయాంలో 71 శాతం పూర్తి చేసినట్లు చంద్రబాబు తెలిపారు.2019లో సాంకేతిక సలహా కమిటీ రూ. 55వేల కోట్ల అంచనాలను ఆమోదించినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వానిదేనని 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని చంద్రబాబు తెలిపారు. పోలవరం నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని నీతి ఆయోగ్ సూచించిందని, అయితే, విద్యుత్ కేంద్రం ఖర్చు మాత్రమే తాము పెట్టుకుంటామని అప్పుడు స్పష్టం చేసినట్లు చంద్రబాబు తెలిపారు.
ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ వ్యయం కేంద్రమే భరిస్తుందని అప్పట్లో స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఈ విషయంలో ఒక బృందాన్ని ఢిల్లీలో ఉంచి కేంద్రానికి కావాల్సిన సమాచారం అందించినట్లు చంద్రబాబు వివరించారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగడం సహజమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.