భయపెట్టాలని చూస్తే.. ఎందాకైనా వెళతాం: జగన్ సర్కారుకు చంద్రబాబు హెచ్చరిక
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సన్నిహితులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఐటీ దాడులతో భయపెడతారా? అంటూ మండిపడ్డారు. రెండ్రోజుల క్రితం అమరావతి పరిరక్షణ కోసం దీక్ష చేపట్టిన ఏఎన్యూ విద్యార్థులు పరుచూరి నందన, సురేష్ సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థులపై దాడులా?
హెల్ప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందన, సురేష్లను సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులపై దాడులు సరికాదని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తే దాడులకు పాల్పడతారా? అని ప్రశ్నించారు. వర్సిటీ వీసీ సమక్షంలోనే విద్యార్థులపై దాడులు జరిగాయన్న చంద్రబాబు.. తన బాధ్యతను వీసీ సక్రమంగా నిర్వర్తించాలన్నారు. వీసీ ప్రవర్తన దారుణంగా ఉందని విమర్శించారు. వీసీ చర్యలను ఖండిస్తున్నామని చెప్పారు.
ఐటీ దాడులతో భయపెడతారా?
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కక్షసాధింపు చర్యలు సరికాదన చంద్రబాబు అధికార పార్టీకి హితవు పలికారు. అధికారులకు జీతాలు, పోస్టింగ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఐటీ దాడులతో అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైట్ కార్డు ఉంటే భూములు కొనడం తప్పా?
ఆఘమేఘాల మీద అర్ధరాత్రి జీవోలు ఇస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు, అధికారులకు చెబుతున్నా.. ఇవాళ వెంకటేశ్వరరావు రేపు మీ వంతు వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి.. కానీ, రాజకీయ కక్షతో కాదని వైసీపీకి హితవు పలికారు. రెండెకరాల భూమి కొంటే కూడా కేసులు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైట్ కార్డు ఉన్నవాళ్లు సీఆర్డీఏ పరిధిలో భూములు కొనడం తప్పా అని ప్రశ్నించారు.
భయపెట్టాలని చూస్తే..
భయపెట్టాలని చూస్తే తాము భయపడమని.. ఎంతవరకైనా దిగుతామని చంద్రబాబు హెచ్చరించారు. చేతకాని పరిపాలన చేస్తూ కియా తరలింపు తాము చేస్తున్నామంటూ నిందలు వేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.