ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన బుల్లెట్లా దూసుకెళ్తా: చంద్రబాబు
రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తాను తీసుకున్నానని అన్నారు.
కర్నూలు: కరువు సీమ రాయలసీమలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. రాయలసీమలో కరువు పరిస్థితులను దూరం చేయడానికి ఈ ఎత్తిపోతల పథకం ఉపయోగపడనుంది.
మచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన శిలాఫలాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తాను తీసుకున్నానని అన్నారు. ముచ్చుమర్రి పథకం రాయలసీమకు జీవనాడి లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాయలసీమ నుంచి కరువును తరిమికొట్టడానికి టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరిస్తూ.. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెయిన్ గన్స్ ద్వారా సాగునీరును అందిస్తున్నట్టు తెలిపారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని, చెరువు పూడిక తీసి నీటిని భద్రపరుచుకోవాలని ఈ సందర్బంగా ఆయన సూచించారు.
'రాయలసీమ కరువు పరిస్థితులను రూపుమాపేందుకు కృషి చేస్తున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి 14సీట్లు కట్టబెడుతారని ఆశిస్తున్నా' అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పులివెందులకు ఈ నెల 11న నీళ్లందిస్తామని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బుల్లెట్ లా ముందుకు దూసుకెళ్తానని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.
నీటి వనరులను సమగ్రస్థాయిలో వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి పురస్కారం దక్కిందని బహిరంగ వేదిక నుంచి చంద్రబాబు తెలియజేశారు.