జగన్తో జాగ్రత్త! కేంద్రానిదే బాధ్యత: బాబు, మేమున్నాం: వెంకయ్య
చిలకలూరిపేట: తాము అభివృద్ధి పైన దృష్టి పెడుతుంటే కొందరు చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు పరోక్షంగా వైసిపి అధినేత జగన్ను ఉద్దేశించి మండిపడ్డారు. గురువారం చిలకలూరిపేటలో అమృత్ పథకం పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం పాత సంత వద్ద బహిరంగ సభలో మాట్లాడారు.
ఈ సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పేదవాడికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. అభివృద్ధి ఇష్టం లేని కొందరు కులాల పేరుతో కుట్రలు చేస్తున్నారని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు.
అవినీతిపరులపట్ల, మభ్యపెట్టే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొందరి కులాల కుంపటి రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. అమరావతికి సమీపంలో అతి పెద్దగా ఉండే నగరంగా చిలకలూరిపేట అభివృద్ది చెందుతుందన్నారు.
ఆర్థికంగా పైకి వచ్చే కార్యక్రమాలు మనం చేపట్టాలన్నారు. డబ్బులు సంపాదించే మార్గం వైపు ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. మేము కష్టపడి పని చేస్తుంటే కొందరు చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా తాము అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.
యువతకు విద్య, నైపుణ్యం అందిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. అభివృద్ధికి అడ్డుపడేందుకే కొందరు కుట్రతో.. రైతులకు భూమి ఇవ్వవద్దని చెబుతున్నారన్నారు. ఇటీవల కొందరు నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు. మేం ప్రభుత్వ సరిగా నడుపుతున్నామని చంద్రబాబు అన్నారు.
అవినీతి లేకుండా తాము పాలన సాగిస్తున్నామన్నారు. కేంద్రం కూడా ఏపీకి పూర్తిగా అండగా ఉండాలని కోరుతున్నామన్నారు. పరిశుభ్ర నగరాల్లో విశాఖకు పదోస్థానం రావడం సంతోషమన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు ఉండాలని ప్రధాని మోడీ సంకల్పించారన్నారు.
చిలకలూరిపేటలో రాజకీయ చైతన్యం ఎక్కువని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చిలకలూరిపేటలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. స్వచ్ఛ ఏపీకి చిలకలూరిపేటలోనే నాంది పలికినట్లు చెప్పారు.
రాష్ట్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న చిలకలూరిపేట పట్టణం భవిష్యత్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో పట్టణంలో 20,500 మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు.
కేంద్రం ప్రకటించిన స్మార్ట్సిటీల తొలి జాబితాలో విశాఖ, కాకినాడ నగరాలు చోటు దక్కించుకోవడం విశేషమన్నారు. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో విశాఖ ఐదో స్థానంలో, విజయవాడ 23వ స్థానంలో నిలవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శమన్నారు. అమృత్ పథకం కింద 33 మున్సిపాలిటీలు ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు
ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు పలు విద్యాసంస్థలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, మరికొన్ని మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించి రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.6వేల కోట్లతో వృద్ధులకు, వికలాంగులకు రూ.వెయ్యి పింఛను ఇస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రేషన్ సరుకులను రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తీసుకునేలా ఈ-పాస్ విధానం ప్రవేశపెట్టామని, పేదవారికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద అందరికీ ఉచిత వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఏపీ ప్రభుత్వం చేపట్టే పనులకు కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. ఇళ్లు, గుళ్లు, ఊళ్లు అన్ని పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు. 1.93 లక్షల ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. 2019 నాటికి స్వచ్ఛ భారత్ ప్రధాని మోడీ లక్ష్యమని చెప్పారు. నిధులు ప్రజలకు అందకుంటే అభివృద్ధి జరగనట్లే అన్నారు.