కడపకు రావాలంటే భయం!: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్య
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో పర్యటించిన ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమన్నారు. పరిశ్రమల కోసం రాష్ట్రంలో పది లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. శాంతిభద్రతలు అదుపులో లేకపోతే పరిశ్రమలు రావని, అందుకు కడప జిల్లాయే ఉదాహరణ అన్నారు.
2020 నాటికి రాష్ట్రంలో పది లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాజధాని అమరావతిలో సుఖసంతోషాలు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. భూమి విషయంలో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే పరిశ్రమలు రావన్నారు. పరిశ్రమల కోసం రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైందని చెప్పారు. ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా భారత్ ఎదుగుతోందని, మానవవనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఏపీలో పరిశ్రమలు పెట్టేవారికి 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొరతలేదన్నారు. ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. జూన్ నాటికి అన్ని ప్రాంతాలకు 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, జౌళీ, ఆటోమోబైల్స్, మినరల్, లెదర్ పరిశ్రమలను అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమల కోసం రైతుల నుండి లాభదాయకమైన భూసేకరణ చేపట్టాని, గోదావరి వృథా జలాలను సద్వినియోగం చేస్కుంటామని చెప్పారు. చంద్రబాబు శుక్రవారం ఉదయం శ్రీ సిటీ సెజ్లో 11 పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేశారు.