హోదా: మాటమార్చిన బాబు, పిలిస్తే కేసీఆర్ రావట్లేదు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదాను మంజూరు చేయడం వల్ల సమస్యలన్నీ తీరిపోతాయా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతోనే ఏపీకి ఉన్న సమస్యలు అన్నీ మొత్తంగా తీరిపోవన్నారు.
పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర సహకారం అందించాలన్నారు. ఈ దిశగానే తాము కృషి చేస్తున్నామన్నారు. ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు సహకరించిందని, మరింత సహకారం ఉంటే తప్ప ఏపీ అభివృద్ధి చెందే అవకాశం లేదన్నారు.
ఏపీ రాజధానిని ప్రైవేటు పరం చేశారంటూ కొన్ని పత్రికల్లో రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ... కంపెనీలు రాకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఏడారిగా మార్చాలా అన్నారు. రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు అవసరం లేదా అని నిలదీశారు.
జూన్ 2వ తేదీ లోగా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలను రెండు ప్రభుత్వాలు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామన్నారు. చాలా అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలని చూశాని, కానీ వారు ముందుకు రావడం లేదన్నారు.
విభేదాలు ఉంటే పెద్ద మనుషుల ద్వారానో, కేంద్రం ద్వారానో పరిష్కరించుకోవచ్చన్నారు. జూన్ 2వ తేదీలోగా సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నామన్నారు. విభజన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ను చంద్రబాబు కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 107 సంస్థల పైన ఎవరికి వారు తోచిన రీతిలో భాష్యం చెప్పే పరిస్థితి ఉందని చెప్పారు.
బాబు మాట మార్చడం సరికాదు: రఘువీరా
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీనిపై చంద్రబాబు మాట మార్చడం విడ్డూరంగా ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఇందిరాభవన్లో నీలం సంజీవరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రఘువీరా మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ, బీజేపీ ద్రోహం చేస్తున్నాయన్నారు.