ఎన్డీఎకు చుక్కలు: 11 పార్టీలతో బాబు చర్చలు, ఫ్రంట్లో వీరంతా...
అమరావతి: బిజెపి నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ)కు చుక్కలు చూపించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
బిజెపికి, కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడగట్టి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఓ జాతీయ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఆ వార్తాకథనం ప్రకారం - చంద్రబాబు ఇప్పటికే 11 పార్టీల నాయకులతో చర్చించారు.
వచ్చే టిడిపి మహానాడు అమరావతిలోనే...
వచ్చే మహానాడును మేలో అమరావతిలో జరిగే అవకాశాలున్నాయి. సాధారణంగా మే చివరి వారంలో రెండు లేదా మూడు రోజుల పాటు మహానాడు జరుగుతుంది. పార్టీ విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను మహానాడులో ఖరారు చేస్తారు. అయితే, మహానాడు వచ్చే నెలలో జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
దానికి ముందు యునైటెడ్ ఫ్రంట్
మహానాడుకు ముందే యునైటెడ్ ఫ్రంట్ సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు జాతీయ చానెల్ కథనం తెలియజేస్తోంది. వచ్చే నెల 7వ తేదీన ఫ్రంట్ తొలి సమావేశం జరుగుతుందని చెప్పింది. ఎన్డీఎ నుంచి వైదొలిగన నేపథ్యంలో చంద్రబాబు మరిన్ని పార్టీలను కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయవచ్చునని అంటున్నారు.
యునైటెడ్ ఫ్రంట్ సమావేశానికి వీరు...
యునైటెడ్ ఫ్రంట్ మొదటి సమావేశానికి శరద్ పవార్ (ఎన్సీపి), మమతా బెనర్జీ (టిఎంసి), మాయావతి (బిఎస్పీ), స్టాలిన్ (డిఎంకె), అఖిలేష్ యాదవ్ (ఎస్పీ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్, నవీన్ పట్నాయక్ (బిజెడి), ఓం ప్రకాశ్ చౌతాలా (ఇండియన్ నేషనల్ లోకదళ్) నేతలతో చంద్రబాబు చర్చించినట్లు ఆ వార్తాకథనం తెలిపింది. అసోం గణపరిషత్ నాయకులతో మాట్లాడినట్లు తెలిపింది. వీరిలో చంద్రబాబు చాలా మంది పాత మిత్రులే. అందువల్ల ఆయన పని సులభమవుతుందని అంటున్నారు.
ఇదే పునాది
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు పునాది వేస్తుందని అంటున్నారు. టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందుకు రాగానే వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇప్పటి వరకు 8 పార్టీలు మద్దతు లభించింది. చంద్రబాబు ఎన్డీఎ నుంచి వైదొలగడాన్ని మమతా బెనర్జీ స్వాగతించారు.
కేసిఆర్ చంద్రబాబు ఫ్రంట్లో చేరుతారా...
థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.. చంద్రశేఖర రావు ఆ దిశలో ముందుకు సాగాలంటే కొద్ది పార్టీలను మినహాయిస్తే చంద్రబాబు సంప్రదించిన పార్టీలనే కూడగట్టాల్సి ఉంటుంది. థర్డ్ ఫ్రంట్ లేదా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే విషయంలో చంద్రబాబు మీద పైచేయి సాధించడం కేసీఆర్కు సులభం కాదు. అందువల్ల ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా పనిచేయాలనుకుంటే యునైటెడ్ ఫ్రంట్తో కలిసి పనిచేయాల్సిందే. ఆయన ఈ ఫ్రంట్తో చేతులు కలుపుతారా, రాష్ట్రానికే పరిమితం అవుతారా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.