అసెంబ్లీ: మాట్లాడుతుండగా వైసిపి గందరగోళం, బాబు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం ఏపీ శాసన సభలో జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. కాగా, ప్రత్యేక హోదా పైన చర్చకు వైసిపి పట్టుబట్టిన నేపథ్యంలో ఉదయం అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది.
చంద్రబాబు జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టారు. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హోదా పైన చర్చించాల్సిందేనని సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా డిమండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. వైసిపి ఎమ్మెల్యేల నిరసన మధ్యనే చంద్రబాబు జీఎస్టీ బిల్లు ప్రవేశ పెట్టారు.
వైసిపి సభ్యుల ఆందోళన పైన చంద్రబాబు మాట్లాడారు. ఓ బిల్లు ప్రవేశ పెడుతుంటే ఇది సరికాదన్నారు. ప్రతిపక్ష సభ్యులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారన్నారు. మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వస్తే మేం చర్చకు సిద్ధమన్నారు. వైసిపికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆ పార్టీ తీరును ఖండిస్తున్నానని చెప్పారు.
మీరు మీ సీట్లలోకి వెళ్లి దేని పైన ప్రకటన చేయమంటే దానిపైన చేస్తానని, అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పైన చిత్తశుద్ధి ఉంటే సభకు సహకరించాలన్నారు. సభా గౌరవాన్ని మంటగలుపుతున్నారన్నారు. వైసిపి సభ్యుల తీరు పైన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం చంద్రబాబు... ప్రత్యేక హోదా పైన మాట్లాడేందుకు ఉపక్రమించారు. ఆ సమయంలోను వైసిపి సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో సభ గందరగోళం ఏర్పడింది. సభలో గందరగోళం ఏర్పడటంతో స్పీకర్ కోడెల శివప్రసాద రావు సభను రేపటికి వాయిదా వేశారు.