చంద్రబాబు 420, ఎలానో వివరించిన మంత్రి కొడాలి నాని, రామోజీ, రాధాకృష్ణకు పెన్షన్ ఇవ్వాలా..?
పల్లెలే పట్టుగొమ్మలని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్టు ఏపీలో ఆదర్శపాలన అందిస్తున్నామని మంత్రి కొడాలి నాని స్పష్టంచేశారు. లక్షా 35 వేల మంది గ్రామ సెక్రటరీలతో ప్రజల సమస్యలను 72 గంటల్లో తీరుస్తున్నామని వివరించారు. 2 వేల జనాభాకు వాలంటీర్ చొప్పున 3 లక్షల గ్రామ వాలంటీర్లు ప్రజల సేవలో నిమగ్నమయ్యారని వివరించారు. కానీ ప్రభుత్వం చేసే మంచి పనులు చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాకు కనిపించవా...? అని కొడాలి నాని ప్రశ్నించారు.
వారికి ఇస్తేనే..
చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణకు పెన్షన్ ఇస్తే రాష్ట్రంలో అందరికీ పెన్షన్లు ఇచ్చినట్టా..? అని అడిగారు. 82 లక్షల మంది విద్యార్థులకు సాయం చేసిన అంశం కనిపించడం లేదా అని అడిగారు. ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేయడం సరికాదని సూచించారు. తమకు ఎంత చెడ్డ పేరు రావాలని చూసినా... ప్రజలు మాత్రం వాస్తవం గమనిస్తారని చెప్పారు. 54 లక్షల మందికి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇస్తున్నామని.. వారు మీరు చెప్పే అబద్దాలను విశ్వసించరన్నారు.
చంద్రబాబు 420
మంచి చేస్తున్న సీఎం జగన్ను విమర్శించడం సరికాదన్నారు. జగన్ను చంద్రబాబు 420 అంటున్నారు.. చంద్రబాబు కంటే 420 ఎవరూ లేరన్నారు. 20వ తేదీ, 4 నెలలో జన్మించిన చంద్రబాబు పెద్ద ఫోర్ ట్వంటీ అని వివరించారు. చైనా నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తోంది.. కానీ చంద్రబాబు మాత్రం ఎల్లో వైరస్ వ్యాపింపజేస్తున్నారని విమర్శించారు.
సమన్యాయం..
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పరిపాలనను వికేంద్రీకరిస్తున్నామని గుర్తుచేశారు. అమరావతికే లక్ష కోట్లు కేటాయిస్తే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏం కావాలి అని కొడాలి నాని ప్రశ్నించారు. రాజధానిని వద్దనేది 29 గ్రామాల ప్రజలేనని.. రైతులు, రైతు కూలీలకు కూడా న్యాయం చేస్తామని చెప్పడంతో వారు కూడా మిన్నకుండిపోయారని చెప్పారు. రాజధానిపై టీడీపీ నేతలు కూడా జోలెపట్టి అడుక్కొని దానిని హైప్ తీసుకురావాలని చూశారన్నారు. ఇన్ని చేస్తున్న ప్రజల్లో సీఎం జగన్కు ఉన్న కీర్తిని తగ్గించలేరని కొడాలి నాని స్పష్టంచేశారు.