ఏ-1 చంద్రబాబు, ఏ-2 అచ్చెన్నాయుడు.. రామతీర్థం దాడి ఘటనలో రిమాండ్ రిపోర్ట్
రామతీర్ధంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కోర్టుకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు ఉంది. చంద్రబాబు ఏ1 కాగా.. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు సహా 12 మందిని ముద్దాయిలుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
రామతీర్థంలో రాళ్ల దాడికి చంద్రబాబు నాయుడు ప్రధాన కారణమని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా కళా వెంకట్రావుపై నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పార్టీ జెండాలతో రామతీర్ధం కొండపైకి వెళ్లిన విజయసాయిరెడ్డిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ దిగి బయటకు వస్తున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారు వద్దకు నడుస్తుండగా కొంత మంది ఆందోళనకారులు చెప్పులు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. రాయి తగిలి వాహనం ముందువైపు అద్దం స్వల్పంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.
విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే చంద్రబాబు నాయుడును ఏ-1 పేర్కొనడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. దాడి సమయంలో చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారా అని అడుగుతున్నారు. కావాలని కేసులు పెట్టడం సరికాదన్నారు.
విజయనగరం జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలోని కోదండ రామస్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగగొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్ రోజువారిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదీ దుమారం రేపింది. అయితే తర్వాత చంద్రబాబు, విజయసాయిరెడ్డి పోటాపోటీగా రామతీర్థం సందర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి కారుపై దాడి జరిగింది.