ఆ విషయంలో సక్సెస్: ఎక్కువ సమయం లేదు..పదవిని ఆస్వాదించండి: చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా
Recommended Video
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి మరోసారి తనదైన శైలిలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కంటే ఈవెంట్ మేనేజర్ గా సక్సెస్ అయ్యారని చెప్పారు. విలువలు కలిగిన రాజనీతిజ్ఞుడిగా చంద్రబాబు కాలేకపోయారని అన్నారు. కిందపడ్డా పైచేయి సాధించానని చెప్పుకొనే ధైర్యం చంద్రబాబుకు మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవిని ఆస్వాదించాలని ఆయన సలహా ఇచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారు : ఇవియం ల పైనే అనుమానాలు: సీఈసికి బాబు ఫిర్యాదు..!
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాజధాని అమరావతిలో నిర్మిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ విగ్రహం సంగతి ఏమైందని, నిర్మాణం ఎంత దాకా వచ్చిందని ప్రశ్నించారు. విగ్రహం నిర్మాణానికి చంద్రబాబు ఒక్క ఇటుక కూడా వేయలేదని చెప్పారు. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని విమర్శించారు.
సూర్యచంద్రులు ఉన్నంత కాలం..
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విజయ సాయిరెడ్డి నివాళి అర్పించారు. దళితుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకున్నారు. సమాజంలో అసమానతలు, సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి తన జీవితాంతం పోరాడారని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి క్షణం పరితపించారని సాయిరెడ్డి చెప్పారు నవసమాజ నిర్మాణానికి అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. స్వతంత్ర భారతావనికి వెలుగు చూపిన మహనీయుడని, ఆయన జయంతిని యావద్దేశం ఉత్సవంలా జరుపుకొంటోందని అన్నారు. నిమ్న వర్గాల ప్రజలు ప్రధాన స్రవంతిలోకి రావడానికి అంబేద్కర్ చేసిన కృషి అజరామరమని కీర్తించారు. భరతమాతకు అంబేద్కర్ ప్రియపుత్రుడని, సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆయన ప్రజల్లో స్ఫూర్తి నింపుతూనే ఉంటారని అన్నారు.
అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఏమైంది?
రాజధాని అమరావతి ప్రాంతంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తానని చంద్రబాబు నాలుగేళ్ల కిందట హామీ ఇచ్చిన విషయాన్ని విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. విగ్రహ నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు ప్రపంచంలోనే మేటైన స్మృతివనం నిర్మిస్తామని ప్రచారం చేశారని, ఎన్నికల సంవత్సరంలో మాత్రమే శంకుస్థాపన చేశారని అన్నారు. 2019 నాటికి విగ్రహం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారని, ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదని, ఒక్క ఇటుక వేయలేదని విమర్శించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొంటున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా కంటే ఈవెంట్ మేనేజర్ గా మాత్రమే సక్సెస్ అయ్యారని విమర్శించారు. విలువలు కలిగిన రాజనీతిజ్ణుడిలా చంద్రబాబు రూపుదిద్దుకోలేకపోయారని ఆయన చెప్పారు.
కిందపడ్డా..పైచేయి నాదేనంటే ఎట్లా?
తాను ఓడినా గెలిచాననే పిడివాదం, కిందపడ్డా పైచేయి సాధించానని చెప్పుకొంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రకటనలకు ఒక సామాజిక వర్గానికి చెందిన మీడియా వంత పాడుతోందని ఆరోపించారు. ప్రజలు మూకుమ్మడిగా ఈసడించుకున్నప్పటికీ.. ఈవీఎంలపై పడి ఏడుస్తున్నారెందుకంటూ ప్రశ్నించారు. కనీసం ఈ నలబై రోజులన్నా అపద్ధర్మ సిఎంగా పదవిని ఆస్వాదించాలని సలహా ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల వాతావరణంలో ఉన్నారని, అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తనకు ఓట్లు రాలేదని ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఫిర్యాదులు చేయడానికి ఢిల్లీకి వెళ్లి తెలుగువారి పరువు తీశారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. 80 శాతం పోలింగ్ జరిగితే ఈవీఎంలు పనిచేయలేదనంలో అర్థమే లేదని అన్నారు. ఈ లాజిక్ ఏమిటో అర్థం కాక ఇన్నాళ్లూ చంద్రబాబుతో అంటకాగిన నాయకులు కూడా తల పట్టుకుంటున్నారని అన్నారు. ఈ బురద తమకెక్కడ పూస్తారోనని వారంతా చంద్రబాబును దూరం పెట్టారని చెప్పారు.