చంద్రబాబు బ్రాండ్ బాబా, మహాత్మాగాంధీతో పోలిక, వర్గం, జాతి కోసం పోరుబాట: గుడివాడ అమర్నాథ్
అమరావతి రాజధాని మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నది కృత్రిమ ఉద్యమమేనని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో తమ జాతి, తమ నేతల భూముల కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని మండిపడ్డారు. తన వర్గం కోసం పోరాడుతున్న చంద్రబాబు నాయుడు తమ ఉద్యమాన్ని గాంధీ తరహాలో పోల్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్టణంలో వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.
గాంధీ జీ-చంద్రబాబు
ఆనాడు స్వాతంత్ర్యం కోసం గాంధీ జీ ఉద్యమించినా విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుచేయడంపై అమర్నాథ్ మండిపడ్డారు. బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం గాంధీజీ అహింసాయుతంగా పోరాడితే ప్రజలు మద్దతిచ్చి పోరాడారని గుర్తుచేశారు. ప్రజలు ముందుకొచ్చి బంగారం, డబ్బులు అందజేశారని.. గాంధీ జీ ఉద్యమానికి చంద్రబాబు నాయుడు ఉద్యమానికి తేడా లేదా అని ప్రశ్నించారు.
గాంధీని చూశారట..
స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీ 1947లో చనిపోయారని.. కానీ 1950లో జన్మించిన చంద్రబాబు నాయుడు కూడా నాటి ఉద్యమాన్ని చూశానని చెప్పడం చూస్తుంటే మతిభ్రమించిందా అని ప్రశ్నించారు. గాంధీ దేశం కోసం ఉద్యమం చేశారని.. కానీ బ్రాండ్ బాబా అయిన చంద్రబాబు మీ జాతి కోసం పోరాడుతున్నారని విమర్శించారు. మీ వర్గం కోసం, జాతి కోసం, అవినీతి కోసం పోరాడుతూ.. ప్రజలను కలిసి రావాలని కోరడం ఏంటీ అని ప్రశ్నించారు.
ఆంధ్రులు భాగస్వామ్యమా..?
మీరు చేస్తున్న ఉద్యమమే కృత్రిమం అని.. దాని కోసం 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలను కలిసి రావాలని కోరడం ఏంటి అని అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు అండ్ కో చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందొద్దా అని అడిగారు. ఒక్క అమరావతిలోనే డెవలప్ జరిగితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు.