జగన్ పై మంత్రులలో అసహనం .. చంద్రబాబే వైసీపీ నేతల కలలోకి వస్తున్నారు : లోకేష్ సంచలనం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసిపి నాయకుడు మోకా భాస్కరరావు హత్యకేసులో అరెస్ట్ అయ్యి , బెయిల్ పై బయటకు వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పరామర్శించిన నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కరెన్సీ నగర్ లోని కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన లోకేష్ వైసీపీ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
విద్యుత్ పై టీడీపీ కే పేటెంట్ .. ప్రజలపై గంటకు రూ.9కోట్ల అప్పు .. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
ఏదీ మర్చిపోం.. వడ్డీతో సహా చెల్లించి తీరుతాం
ఏదీ మర్చిపోమని, వడ్డీతో సహా చెల్లించి తీరుతాం అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న వారిని జగన్ జైల్లో పెట్టిస్తున్నారని ప్రజలంతా గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంతగా అణగదొక్కాలని ప్రయత్నం చేసినా రెట్టింపు వేగంతో ముందుకు వెళ్తామని లోకేష్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి అవినీతి ఆరోపణలు చేయడం తప్పా, ఒక్క ఆధారమైనా చూపించగలిగారా అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు పేరును వైసీపీ మంత్రులు జపిస్తున్నారన్న లోకేష్
వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మంత్రులలో అసహనం పెరిగిపోయిందని, జగన్ పేరు కూడా తలవని మంత్రులు ఉన్నారంటే ఆశ్చర్యంలేదని పేర్కొన్నారు.చంద్రబాబు పేరును చాలామంది వైసీపీ మంత్రులు జపిస్తున్నారని, నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు వైసిపి నేతల కలలోకి చంద్రబాబే వస్తున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్. జగన్ కు వైసీపీ నేతలు ఝలక్ ఇస్తారంటూ వ్యాఖ్యానించారు .
జగన్ హయాంలో అధికారులు జైలుకే
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారని, ఆ వ్యవహారంలో చాలా మంది అధికారులు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో చాలా మంది అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని నారా లోకేష్ విమర్శించారు. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర , జేసీ ప్రభాకర్ రెడ్డిలపై పెట్టిన కేసులు అన్నీ తప్పుడు కేసులేనని పేర్కొన్నారు .
ఆ 40మంది అవినీతి చిట్టా ఉంది... ఆ ఎమ్మెల్యేలు జైలుకెళ్ళటం ఖాయం
టిడిపి నేతలపై పెట్టింది ముమ్మాటికి దొంగ కేసులేనని నిప్పులు చెరిగారు లోకేష్. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని,దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల సేకరణలో జరిగిన అవినీతిలో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకెళ్లడం ఖాయమని పేర్కొన్నారు లోకేష్. ఇళ్ల స్థలాల సేకరణ అవినీతికి సంబంధించి టిడిపి వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతర్వేది రథం దగ్ధం సంఘటన ఒక మతం పై జరుగుతున్న దాడి అని పేర్కొన్న నారా లోకేష్ సిబిఐ విచారణ జరగాలంటూ డిమాండ్ చేశారు.