చంద్రబాబు ఓ అవినీతి చక్రవర్తి..! ఢిల్లీలో వైసీపి నేతల పుస్తక ఆవిష్కరణ..!!
ఢిల్లీ/ హైదరాబాద్ : ఏపీ సీయం చంద్రబాబు నాయుడు పై ప్రతిపక్ష వైసీపి ఎంపీలు ఘాటుగా విమర్శలు గుప్పించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అవినీతిని లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం అనికూడా చూడకుండా దోచుకున్నారని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో నేడు చంద్రబాబు అవినీతిపై 'చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. పార్లమెంట్ లోని ఎంపీలందరికి ఆ పుస్తకాన్ని అందిస్తామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అవినీతిపై కేంద్రం విచారణ చేపట్టాలని వారు వైసీపి ఎంపీలు డిమాండ్ చేసారు.
బాబు అవినీతిలో నంబర్ వన్..! పుస్తకాన్ని ఆవిష్కరించిన వైసీపి ఎంపీలు..!!
అవినీతి కి ఏదీ అనర్హం కాదన్నంత రేంజ్ లో చంద్రబాబు ఏపిలో దోపిడీ చేశారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే లను అడ్డగోలుగా కొన్నారని, చంద్రబాబు నిజ స్వరూపం చెప్పడానికే ఈ పుస్తకాన్ని ప్రచురించినట్టు, ఎంపీలందరికీ ఈ పుస్తకాన్ని పంచి పెడతామన్నారు. చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీ లు విడుదల చేశారు. అమరావతి నుంచి పోలవరం వరకు అవినీతి చేశారని మాజీ ఎంపీ వైవీ. సుబ్బారెడ్డి విమర్శించారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి అవినీతి పై టీడిపి పుస్తకం..! ఇప్పుడు బాబు అవినీతిపై వైసీపి పుస్తకం..!!
మరుగుదొడ్ల లో రూ.600 కోట్ల అవినీతి కి పాల్పడ్డారని, బాబు అవినీతి పై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలని వైసీపి ఎంపీలు డిమాండ్ చేసారు. రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ అవినీతి వ్యవహారాల కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కాబినెట్ మీటింగ్ లో కారు చౌకగా భూములు సంస్థలకు కట్టబెట్టారని. రాష్ట్ర బడ్జెట్ ను మించి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబునాయుడు ఢిల్లీ లో ప్రతిపక్షాలని ఏకం చేయడానికి రావడం లేదని. పారిశ్రామికవేత్తలను కలిసి పార్టీ డొనేషన్ తీసుకోవడానికి వస్తున్నారని ఆరోపించారు.
లోటుబడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని బాబు విడిచిపెట్టలేదు..! అందుకే బుక్ రాసామంటున్న ఎంపీలు..!!
చంద్రబాబు నాయుడు అవినీతి కి ఆనవాలు గా తయారు అయ్యారని, చంద్రబాబు నాయుడు రాష్ట్ర బడ్జెట్ కి సంబందం లేకుండా దాదాపు 6లక్షల కోట్లు అవినీతి చేశారని వైసీపి ఎంపీలు మండిపడ్డారు. రాజధాని భూములతో పాటు, లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో సైతం అవినీతి చేశారని చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవినీతి చేశారో చాలా సవివరంగా పుస్తకం లో పొందుపరిచామని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరిస్థితులను గమనించి, అవినీతి రహిత పాలన అందించే జగన్ కి అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేసారు.
బాబు అవినీతిపై కేంద్రం విచారణ జరపాలి..! డిమాండ్ చేస్తున్న వైసీపి ఎంపీలు..!!
రాజ్యసభ సభ్యుడు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి రాక్షస పాలన జరుగుతోందని ఆరోపించారు. 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు అమలు చేయలేదు. ఇద్దరు చీఫ్ సెక్రటరీలు బయటికి వచ్చి చంద్రబాబు అవినీతిని బయటపెట్టారని, 6 లక్షల కోట్ల అవినీతి కి పాల్పడ్డారని ఆయన బాబు పై ఘాటుగా స్పందించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీ వరప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తో పాటు మరికొంత మంది సీనియర్ నేతలు పాల్గొన్నారు.