420రోజున కొంగజపమా?, నీరుగార్చింది నువ్వు కాదా?, తరిమికొట్టండి బాబుని: జగన్
అమరావతి: 2019ఎన్నికల్లో ప్రత్యేక హోదా డిమాండే కీలక పాత్ర పోషించబోతుందన్న విషయం ఇప్పటికే స్పష్టమైపోయింది. పార్టీలు సైతం అదే లైన్ పై తమ పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తున్నాయి. ఈ విషయంలో ముందు నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న వైసీపీ.. ఎమ్మెల్యేలతో సైతం రాజీనామా చేయించే సరికొత్త వ్యూహానికి తెరలేపనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు వైసీపీని డామినేట్ చేసేందుకు టీడీపీ కూడా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. మొత్తంగా కేంద్రంపై పోరు కన్నా.. ఈ రెండు పార్టీల మధ్య పోరే రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వైసీపీ అధినేత జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
పాదయాత్ర తర్వాత అనూహ్య నిర్ణయం, బాబుకు జగన్ షాక్: ఒక్క దెబ్బకు పవన్ కళ్యాణ్ కూడా
బాబు.. ఒక 420
ఈ నెల 20వ తేదీన తన పుట్టిన రోజు నాడు దీక్ష చేయబోతున్న చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు నాలుగో నెల 20వ తేదీ అని, దీనిని ఇంగ్లిష్లో ఫోర్ ట్వంటీ అంటారని, అదే రోజున ఆయన '420' దీక్ష చేయబోతున్నారని విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా మైలవరం బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొంగజపం చేస్తావా?
ప్రత్యేక హోదా కోసం ఇటీవల వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి.. నిరాహార దీక్ష చేశారని, ఆ రోజునే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి దీక్షకు దిగి ఉంటే దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరిగేదని అన్నారు. అదే జరిగితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు.
ఆ రోజు తన ఎంపీలతో రాజీనామాలు, నిరాహార దీక్ష వద్దని చెప్పిన చంద్రబాబు ఈ రోజు 420 రోజున కొంగజపం చేస్తారట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే దీక్ష ఫోర్ ట్వంటీ దీక్ష కాదా? అని నిలదీశారు
నీరుగార్చింది బాబే..
ప్రత్యేక హోదాను నీరుగార్చింది చంద్రబాబే అని ఈ సందర్భంగా జగన్ ఆరోపించారు. చంద్రబాబు కాకుండా మరొకరు సీఎం స్థానంలో ఉండి ఉంటే హోదా నడుచుకుంటూ వచ్చేదని అన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తిని రాష్ట్రం నుంచి తరిమికొట్టి.. రాజకీయాల్లో నిజాయితీ, విశ్వసనీయతను పెంపొందించేందుకు దోహదపడాలని ప్రజలకు పిలుపునినచ్చారు.
నవరత్నాలపై హామి
గతంలో హామి ఇచ్చిన నవరత్నాల గురించి ప్రస్తావిస్తూ.. మనందరి ప్రభుత్వం రాగానే వాటిని అమల్లోకి తీసుకొస్తామని అన్నారు. నవరత్నాలతో ప్రజలందరి జీవితాల్లో సంతోషం నింపుతామని హామి ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రస్తుతం నియోజకవర్గానికి రెండు అంబులెన్స్లు మాత్రమే ఉన్నాయని, అంబులెన్సుల సిబ్బందికి కూడా గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని అన్నారు.
హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకున్నవారికి ఆరోగ్యశ్రీ వర్తించదనడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమానుషమైన నిబంధనలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకొనేవిధంగా వెసులుబాటు కల్పిస్తామన్నారు.
డయాలసిస్, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల రూ. 10వేల పింఛన్ ఇస్తామని చెప్పడం గమనార్హం.