ఫోర్త్ జెండర్: చంద్రబాబుపై విజసాయి తీవ్ర వ్యాఖ్యలు, ‘టీడీపీది అవకాశవాద రాజకీయం’
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫోర్త్ జెండర్అని, ప్రకృతిలో ఆయన ఎటూకాని వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
అరవింద్ కేజ్రీవాల్ మద్దతు కోరిన టీడీపీ ఎంపీలు: ముందుకొచ్చిన స్టాలిన్, షాకిచ్చిన పళని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టినప్పుడు దాని వల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని అదే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రత్యేక హోదా కోరుకుంటోందని, ఏపీకి న్యాయం జరిగేందుకు ఏ పార్టీ అవిశ్వాసం తీర్మానం పెట్టినా మద్దతు ఇస్తామని గతంలో చెప్పామని గుర్తు చేశారు.
ఫోర్త్ జెండర్గా
ఏపీ సీఎంగా ఉంటూ ఫోర్త్ జెండర్గా ప్రజలను మోసం చేస్తున్నారని విజయసాయి మండిపడ్డారు. కాలానికి తగ్గట్లుగా చంద్రబాబు రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఓ వైపు బీజేపీతో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే.. మరో వైపు అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నారని మండిపడ్డారు.
హోదా నిరసనలు
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద గురువారం ఉదయం నిరసనకు దిగారు. పార్టీ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డిలతోపాటు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
అవకాశ రాజకీయం, ద్వంద్వ వైఖరి..
ఈ సందర్భంగా మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ నాలుగేళ్లపాటు బీజేపీతో ఉండి, ఎటువంటి ఒత్తిడితేకపోవడం వల్లే ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. తమతోపాటు టీడీపీ ఎంపీలు కూడా అప్పుడే రాజీనామా చేసివుంటే కేంద్రం ఎప్పుడో దిగివచ్చేదని వరప్రసాద్ అన్నారు. కానీ, టీడీపీ, చంద్రబాబు అవకాశ రాజకీయం, ద్వంద్వ వైఖరితో ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని మండిపడ్డారు.
అధికారం కోసం బీజేపీ, మోడీ పంచన..
కడప పరిశ్రమపై ఆరు నెలల్లోపు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని విభజన చట్టంలో ఉంటే నాలుగేళ్ల నుంచి అధికారంలో ఉండీ కూడా ఏమాత్రం పట్టించుకోలేదని టీడీపీపై వరప్రసాద్ ధ్వజమెత్తారు. మొదటి సారి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రెండోసారి వాజపేయి పుణ్యమా అని ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేసిన చంద్రబాబు.. 2014 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి బీజేపీ, నరేంద్ర మోడీ పంచన చేరారని విమర్శించారు.
నిధుల దోపిడీ, ప్రాజెక్టుల్లో అవినీతి
కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ఇచ్చిన నిధులన్నింటినీ చంద్రబాబు దోచుకున్నారని వరప్రసాద్ ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఉపయోగించుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే చంద్రబాబు చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికీ ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందంటే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మఓమన్ రెడ్డి వల్లేనని వ్యాఖ్యానించారు.