పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగటం జగన్ రెడ్డికి ఇష్టం లేదు..అందుకే బెదిరింపులు: చంద్రబాబు ఫైర్
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ గురించి టిడిపి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండవ దశ నామినేషన్ల పురోగతిపై నేతల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ధైర్యంగా అందరూ నామినేషన్లు వేయాలని సూచించారు. జగన్ పాలనపై , వైసీపీ తీరుపై విరుచుకుపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని టిడిపి చూస్తోంటే ,ధ్వంసం చేయాలని వైసిపి చూస్తోంది
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని టిడిపి చూస్తోందని ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని వైసిపి చూస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. పిరికిపందలు కాబట్టే వైసిపి నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం జగన్ రెడ్డికి ఇష్టంలేదని, కావాలని వైసిపి వాళ్లను రెచ్చగొట్టి ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు
తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని, ఎన్నికల్లో ఓడిపోతారు కాబట్టే ఈ రకమైన దారుణాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం, రాష్ట్రానికి దగా చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అవినీతిని ప్రశ్నించారని పట్టాభిపై హత్యాయత్నం చేశారని, మీ అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్ పై నిప్పులు చెరిగారు .అచ్చెన్నాయుడు పై అన్ని సెక్షన్ లు పెట్టారు.. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ఎన్ని సెక్షన్లు పెట్టాలని చంద్రబాబు ప్రశ్నించారు.
ఆ అధికారులను , పోలీసులను గుర్తు పెట్టుకుంటామన్న చంద్రబాబు
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జగన్ రాబట్టింది గుండుసున్నా అని పేర్కొన్న చంద్రబాబు పోలవరానికి, అమరావతికి నిధులు రాకున్నా జగన్ నోరెత్తలేదు అన్నారు. వైసీపీ ఉన్మాదుల తో కుమ్మక్కై రూల్ ఆఫ్ లా ను భగ్నం చేసే పోలీసులను, అధికారులను గుర్తు పెట్టుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు ఎక్కువైపోయాయి అని, తప్పులు చేయడం వాటిని ఎదుటి వాళ్ళ పై రుద్దటం జగన్ దుష్టబుద్ధి అని చంద్రబాబు విమర్శించారు.
చేసే ప్రతి తప్పుకు వైసిపి ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరిక
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా వారికి చెల్లిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. చేసే ప్రతి తప్పుకు వైసిపి ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించిన చంద్రబాబు జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేస్తున్న తప్పులను వరుసగా ఏకరువు పెట్టారు. పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న టిడిపి బలపరిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపిన చంద్రబాబు ధైర్యంగా నామినేషన్లు దాఖలు చేయాలని, భయపడాల్సిన అవసరం లేదని, టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలలో వైసిపి కి తగిన గుణపాఠం చెప్పాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.