టీడీపీపై చంద్రబాబు పట్టు తప్పుతోందా? మొన్న బుచ్చయ్య.. ఇప్పుడు కేశినేని నానీ ఎపిసోడ్; హాట్ టాపిక్ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటుందా ? పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తున్నాయా? అధికారం కోల్పోయినా మారని నేతల తీరు టీడీపీ భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేస్తుందా ? పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకులను కంట్రోల్ చెయ్యలేక చేతులెత్తేస్తున్నారా? తాజా కేశినేని నానీ ఎపిసోడ్ అదే చెప్తుందా ? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
చంద్రబాబుకు టీడీపీకి కొత్త కష్టాలు .. పార్టీపై బాబు పట్టు తప్పుతోందా ?
సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి, సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్షంలో ఉండడం, అధికారంలోకి రావడం కొత్తేమీ కాదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగానూ పోరాటం చేసింది. అధికార పార్టీ గా పాలన చేసింది. కానీ గతంలో ఎన్నడూ ఎదురుకాని అనుభవం ఈ దఫా తెలుగుదేశం పార్టీకి ఎదురు కావడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది.
గత ఎన్నికల్లో దారుణ ఓటమి పాలైన చంద్రబాబు నాయుడుకు, ఆ పార్టీకి ఇప్పుడు గడ్డు కాలం కొనసాగుతుంది.రాష్ట్రంలో టీడీపీకి చెక్ పెడుతూ ముందుకు సాగుతున్న వైసీపీ ఒకవైపు, పార్టీ నేతల పంచాయితీలు మరోవైపు చంద్రబాబుకు ఇబ్బందిగా మారాయి. ప్రస్తుత తరుణంలో పార్టీ నేతలకు గట్టిగా చెప్పలేక బాబు సతమతమవుతున్నాడు. దీంతో పార్టీపై చంద్రబాబు పట్టు తప్పుతోంది అన్న చర్చ పార్టీ శ్రేణులలోనూ జోరుగా కొనసాగుతోంది.
నేతల రాజీనామాలు, పార్టీలో అసమ్మతి, బాహాటంగా అసంతృప్తి పర్వాలు
టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు పాతికేళ్లుగా పార్టీలో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగించారు. పార్టీ శ్రేణులు అందర్నీ ఏకతాటి మీద నడిపించారు. చంద్రబాబు మాట దాటి ఏ ఒక్క నేత బయట మాట్లాడిన దాఖలాలు కూడా గతంలో పార్టీలో లేవు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తెలుగుదేశం పార్టీలో పరిణామాలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎన్నడు పార్టీ అధినేత గీసిన గీత దాటని తెలుగుదేశం పార్టీ నేతలు, ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళుతూ సంచలన వ్యాఖ్యలు చేసి మరీ వెళ్లారు.
వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ వంటి నాయకులు చంద్రబాబు పై, లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి మరీ వెళ్లారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న వారంతా కొందరు పార్టీలో సీనియర్ నేతల తీరు, తమను చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న కారణంగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
టీకప్పులో తుఫానులా ముగిసిన గోరంట్ల రగడ .. ఇప్పుడు కేశినేని నానీ వంతు
ఇక పార్టీలో ఉన్న వారిలో సైతం తీవ్ర అసహనం వ్యక్తమౌతుంది. బాహాటంగానే సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, తిట్టుకుంటూ పార్టీ పరువును రోడ్డున పెడుతున్నారు. మొన్నటికి మొన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి సీనియర్లను పట్టించుకోవడంలేదని, తనకు సరైన ప్రాధాన్యత పార్టీలో దక్కటం లేదని అలక వహించి పార్టీని వీడి బయటకు వెళ్ళేదాకా సినిమా చేశారు. ఆ తర్వాత చల్లబడి మళ్లీ పార్టీలో కొనసాగుతున్నారు.
ఇక తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కేశినేని నాని తన కుమార్తె కూడా ఎన్నికలకు దూరంగా ఉంటుందని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. తనను టార్గెట్ చేసి బాహాటంగా విమర్శించిన బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై చర్యలు తీసుకోలేదని పార్టీ అధిష్టానంపై కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చర్చ జరుగుతుంది.
కీలక నేతలు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా .. చంద్రబాబు పార్టీని నడిపించటం కష్టం
ఇటీవల బుచ్చయ్యచౌదరి ఎపిసోడ్ టీ కప్పులో తుఫానులా ముగిస్తే, ఇప్పుడు కేశినేని నాని ఎపిసోడ్ ఏ విధంగా మలుపు తిరుగుతుందో అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతుంది. మరోపక్క పార్టీలో గతంలో కీలక నేతగా వ్యవహరించిన ఎంతో మంది నేతలు ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, గల్లా అరుణకుమారిలు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి నారాయణ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వంటి వారు ఉన్నారో లేరో కూడా అర్ధం కావటం లేదు .
తెలుగుదేశం పార్టీ తరఫున జరుగుతున్న కార్యక్రమాలలో కూడా వీరు పాల్గొన్న దాఖలాలు కనిపించటం లేదు. ఈ క్రమంలో తాజా పరిణామాలు తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు పట్టు తప్పుతుంది అన్న చర్చకు కారణంగా మారింది. చంద్రబాబు పార్టీని ముందుకు నడిపించటానికి అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
పార్టీపై లోకేష్ పట్టు సాధించటం కష్టమే .. తెలుగు తమ్ముళ్ళ భావన
ఇక ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్న నారా లోకేష్ పార్టీని ఏకతాటి మీదకు తీసుకు వస్తాడు అనుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్లను అందరిని ఏక తాటి మీదికి తీసుకురావడం లోకేష్ వల్ల కాదు అనేది చంద్రబాబుకూ తెలిసిన సత్యం. ఒకపక్క టిడిపిని అడుగడుగున నిర్వీర్యం చేయడంలో అధికార వైసిపి వేస్తున్న అడుగులు, మరోపక్క సీనియర్ నాయకులు అలకలు, ఇంకోవైపు పార్టీకి రాజీనామా చేస్తున్నామని వెళ్ళిపోతున్న నేతల తీరు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో మిగిలే వారెవరు అన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది.
అంతర్గత పోరు పీక్స్ కు చేరిన చోట అధికారం కూడా లేని చంద్రబాబు మాట వినేవారెవ్వరు ?
వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న చర్చ జరుగుతుంది. ఏదిఏమైనా ఈ పరిణామాలు చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పార్టీని చక్కదిద్దుతారా? పట్టు తప్పుతున్న పార్టీని కట్టడి చేస్తారా ? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబుకు అది సాధ్యమేనా ? అధికారం కోల్పోయి మూలుగుతున్న పార్టీలో బాబు కర్ర పెత్తనం కష్టమే అనిపిస్తుంది.
కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అందంగా తయారైన టిడిపి నాయకులను బాబు అనునయించి ముందుకు నడిపించగలుగుతాడా అంటే అనుమానమే అన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది.