పవన్ కళ్యాణ్ మరో జేఎఫ్సీ వేయాలి, పిచ్చికుక్కల..: బాబుపై పార్థసారథి సంచలనం
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబే తొలి విలన్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి బుధవారం మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబు ప్రజలను ఎందుకు మభ్యపెట్టారో చెప్పాలని నిలదీశారు. ఉద్దేశ్యపూర్వకంగా మభ్యపెట్టారా లేక మరో కారణం ఉందా అని నిలదీశారు.
చంద్రబాబు మభ్యపెట్టడంపై పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. విభజన హామీల విషయంలో కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. చంద్రబాబుకు సిగ్గుంటే వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
ఢిల్లీలో దీక్ష చేసిన జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసమే పోరాడుతోందని, దీనిని ప్రజలు గుర్తించాలని పార్థసారథి చెప్పారు. ఢిల్లీ నడివీధుల్లో ఓ రోజు నిరాహార దీక్ష చేసి, ఆ తర్వాత అరెస్టైన నాయకుడు తమ పార్టీ అధినేత జగన్ అన్నారు. హోదా కోసం పోరాటం చేస్తున్న ఒకే ఒక్క యోధుడు జగన్ అన్నారు.
పిచ్చికుక్కల వంటి మంత్రివర్గం సభ్యులతో
గుంటూరులో వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రత్యేక హోదా ఆవశ్యకత చాటిచెప్పిన నాయకుడు జగన్ అని పార్థసారథి చెప్పారు. పిచ్చికుక్కల వంటి తన మంత్రివర్గ సభ్యులతో జగన్పై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు విభజనతో అన్యాయం చేశాయన్నారు.
జగన్ను ఎదుర్కోలేక కేసులు అంటూ
జగన్ను నేరుగా ఎదుర్కోలేక కేసులు ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు. హోదాపై మొదటి నుంచి మాట మారుస్తోంది చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండేందుకు అర్హుడా అని అభిప్రాయపడ్డారు. అఖిల పక్ష భేటీ అంటూ, అఖిల సంఘాల మీటింగ్ అంటూ మాట్లాడటం విడ్డూరమన్నారు.
మద్దతిచ్చినా ఇవ్వకున్నా అవిశ్వాసం
స్వర్గీయ నందమూరి తారక రామారావు తెరపై నటిస్తే, చంద్రబాబు నాయుడు నిజ జీవితంలో నటిస్తున్నారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలకు తీరని ద్రోహం చేశారన్నారు. ఎవరు మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా అవిశ్వాసం పెడతామన్నారు.