చంద్రబాబు తొలి శత్రువు: జగదీశ్వర్, కోర్టుకెళ్తాం: గంటా
హైదరాబాద్/విజయవాడ/న్యూఢిల్లీ: తెలంగాణకు మొదటి శత్రువు ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం విమర్శించారు. కొన్ని పార్టీలు కావాలనే విద్యార్థులను ప్రభుత్వం పైకి రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సన్నాసుల్లా ఆంధ్రా పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు.
బాబు మాట మీద ఎప్పుడు నిలబడలేదు: పోచారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మాట మీద నిలబడలేదని మరో మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే తెలంగాణ కాంగ్రెసు నేతలకు ఏమాత్రం అర్థం కావడం లేదన్నారు. పునర్నిర్మాణం అంటే ప్రజల మొహాల్లో చిరునవ్వులు పూయించడమేనన్నారు.
స్థానికత విషయంలో కోర్టుకు: గంటా
స్థానికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరు మారకుంటే తాము కోర్టుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఇంజినీరింగ్ కళాశాలల్లో తరగతులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలో రెండు రోజులు ఆలస్యమైనా 23 నాటికి కొన్సెలింగ్ ముగుస్తుందన్నారు. తెలంగణలో సీట్లు పొందే ఏపీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి సిద్ధంగానే ఉన్నామని కానీ తమ ప్రాథమిక హక్కు కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కేసీఆర్ తాను ముఖ్యమంత్రిని అన్న విషయం మర్చిపోయి ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గురువారం విశాఖలోని ఎంసెట్ కౌన్సిలింగ్ సెంటర్లను ఆయన పరిశీలించారు.
ఏపీలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి 34 కేంద్రాల్లో ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.