చంద్రబాబుకు జగన్ వరం: ఉత్తరాంధ్ర రుణం తీర్చుకో.. వెన్నుపొటు వద్దు: వైసీపీ నేత
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోన్న నిరసన ప్రదర్శనల పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు తనదైన శైలిలో ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఎందుకు మోకాలడ్డుతున్నారు..
తెలుగుదేశం కష్టాల్లో ఉన్న ప్రతీసారీ ఉత్తరాంధ్ర ప్రాంతం పార్టీకి అండగా నిలిచిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు అన్నారు. అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పరిపాలన రాజధానిగా మార్చడానికి ప్రయత్నిస్తోంటే చంద్రబాబు ఎందుకు అడ్డు పడుతున్నారని ప్రశ్నించారు. సోమవారం ఆయన విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉత్తరాంధ్ర సాయాన్ని మర్చిపోయారా?
ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదా? అని నిలదీశారు. ఉత్తరాంధ ప్రజలు చేసిన సాయాన్ని మర్చిపోయారా అన్ని ప్రశ్నల వర్షాన్ని కురపించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రభంజనాన్ని తట్టుకుని కూడా ఉత్తరాాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి జైకొట్టారని అన్నారు. అలాంటి ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడతారని తాను కలలో కూడా ఊహించలేదని దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు.
చంద్రబాబే ప్రధాన అడ్డంకి..
విశాఖపట్నం సహా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి గానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగు పడటానికి గానీ చంద్రబాబే ప్రధాన అడ్డంకి అని ధ్వజమెత్తారు. విశాఖకు రావాల్సిన పలు సంస్థలను తన హయాంలో అమరావతికి తరలించడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ఫలితంగా- అవన్ని వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
ఉత్తరాంధ్ర రుణాన్ని తీర్చుకునే అవకాశం..
చంద్రబాబు నాయుడికి ఉత్తరాంధ్ర ప్రజల రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని వైఎస్ జగన్ కల్పించారని, దీన్ని దుర్వినియోగం చేయొద్దని దాడి వీరభద్ర రావు సూచించారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు చంద్రబాబు సహకరించి.. ఈ ప్రాంత ప్రజల రుణాన్ని తీర్చుకోవాలని హితబోధ చేశారు. 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఉత్తరాంధ్ర ఎంతగానో ఆదరించిందని, దయచేసి అన్యాయం చేయొద్దని దాడి వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధికి చక్కని అవకాశం..
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి వైఎస్ జగన్ ఓ చక్కని అవకాశాన్ని ఇచ్చారని దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, ఈ ప్రాంత ప్రజల తలసరి ఆదాయం చాలా తక్కువ అని, అలాంటి ఈ జిల్లాల్లో అభివృద్ధితో పాటు అధికారాన్నీ కూడా సమానంగా వికేంద్రీకరించాలని జగన్ చేస్తోన్న ప్రయత్నాన్ని తాను అభినందిస్తున్నానని అన్నారు.