చంద్రబాబు స్పష్టంగా ఉన్నా: నామా, బిఏసిపై వ్యూహాలు
విభజన అంశంపై లోకసభ, లోక్పాల్ పైన రాజ్యసభలు వాయిదాపడ్డాయి. అనంతరం నామా విలేకరులతో మాట్లాడారు. లోక్పాల్ బిల్లుకు తాము పూర్తి మద్దతిస్తున్నామన్నారు. విభజనపై చంద్రబాబు ఎప్పుడో స్పష్టం చేశారన్నారు. ఇరు పక్షాలకు న్యాయం జరగాలనేదే బాబు ఉద్దేశ్యమన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ సీమాంధ్రకు న్యాయం చేయాలన్నారు. అధికారం కోసం తెలుగుజాతిలో కాంగ్రెసు పార్టీ చిచ్చుపెట్టిందని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం పైన సభలో చర్చ జరగాలన్నారు. తొమ్మిదేళ్ల యూపిఏ హయాంలో భారీ అవినీతి జరిగిందని, పదేళ్ల క్రితమే లోక్పాల్ వస్తే ఇంత అవినీతి జరగకపోయి ఉండేదన్నారు.
శాసనమండలి బిఏసి
హైదరాబాదులో శాసనమండలి బిఏసి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీధర్ బాబు, రామచంద్రయ్యలు పాల్గొన్నారు. మండలి బిఏసి అనంతరం శాసనసభ బిఏసి జరగనుంది.
ఇరుప్రాంత నేతల వ్యూహాలు
శాసనసభ బిఏసిలో అనుసరించాల్సిన విషయమై ఇరు ప్రాంతాల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. సీమాంధ్ర ప్రాంత నేతలు కూడా తమ వ్యూహాలు రచిస్తున్నారు. బిఏసిలో మద్దతు కోసం తాము అన్ని పార్టీల సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి అన్నారు. అసెంబ్లీకి బిల్లు వస్తే మరో బిఏసిని పెట్టాకనే చర్చకు అనుమతిస్తామని స్పీకర్ గత బిఏసిలో చెప్పారని శోభా నాగి రెడ్డి చెప్పారు.