హరికృష్ణకు బాబు ఓదార్పు, హుటాహుటిన వచ్చిన జూ.ఎన్టీఆర్
హైదరాబాద్: జానకిరామ్ మృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల శేఖర రావులు సంతాపం తెలిపారు. వీరు వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర కలత చెందినట్లు పేర్కొన్నారు. జానకిరాం ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
మృతి విషయం తెలియగానే చంద్రబాబు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్తో కలిసి హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. హరి భుజం మీద చెయ్యి వేసి ఆయనను ఓదార్చేందుకు ప్రయత్నించారు. బాలకృష్ణ సహా హరికృష్ణ సోదరులు, ఇతర బంధువులు అంతా విషణ్ణవదనాలతో అక్కడకు వచ్చారు.
జానకిరామ్ భార్య, ఇద్దరు కుమారులు కూడా ప్రమాదం విషయం తెలియగానే హరి ఇంటికి వచ్చారు. జానకిరామ్ భార్యను ఎదార్చడం ఎవరి తరం కాలేదు. తండ్రి కోసం బిడ్డలు విలపిస్తున్న తీరు అందర్నీ కలచివేసింది. మృతి విషయం తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ వెంటనే హరి నివాసానికి వచ్చారు.
జానకిరామ్ మృతదేహానికి అంత్యక్రియలు మొయినాబాద్లోని జానకిరామ్ సొంత ఫామ్ హౌస్లో జరగనున్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మాసాబ్ ట్యాంకులోని హరికృష్ణ నివాసం నుంచి మొదలయ్యే జానకిరామ్ అంతిమ యాత్ర సాయంత్రం 4 గంటలకు మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు చేరుకుంటుంది. అనంతరం జానకిరామ్ భౌతిక కాయానికి అక్కడే అంత్యక్రియలు జరుగుతాయి.