బాబు, కేసీఆర్లు టీకి పిల్చినా వెళ్తా: ఆజాద్, పార్టీని దేవుడే చూస్కుంటాడు: సీఆర్
హైదరాబాద్/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులు తనను టీ తాగడానికి పిలిచినా వెళ్తానని, వారితో తనకు ఎళాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని కాంగ్రెస్ నేత గులాం నహీ ఆజాద్ చెప్పారు. వ్యక్తిగతం వేరు, రాజకీయాలు వేరన్నారు.
తెరాస నేత కే కేశవ రావుతో కాంగ్రెస్ నేత జానా రెడ్డి కలవడంపై విలేకరులు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. కేకేను జానా కలవడంలో తప్పులేదన్నారు.
శాసన మండలి ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తారని, వారి పైన నమ్మకం ఉందని ఆజాద్ అన్నారు. కానీ, తమ అనుమానమంతా దొంగతనంగా ఓటు వేయించుకునే వారి పైనే ఉందని విమర్శించారు.
ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖలో అన్నీ అబద్దాలే ఉన్నాయని ఆజాద్ వ్యాఖ్యానించారు. దేశంలో ధరలు తగ్గాయని మోడీ చెబుతున్నది అబద్ధమన్నారు. అంతర్జాతీయంగా పెట్రోల్ రేట్లు తగ్గినా మనకు మాత్రం తగ్గలేదని తెలిపారు.
పెట్రోల్ ధరల పెంపుతో ప్రజలపై వేల కోట్ల భారం పడిందన్నారు. నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్నారు. దేశ వృద్ధి రేటు మందగిస్తోందన్నారు. ప్రధాని మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.
రైల్వే చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు అవకాశం కల్పించలేదని ధ్వజమెత్తారు. ఉపాధి కల్పనలో ఎన్డీఏ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు.
ఏడాది కాలంలో కేసీఆర్ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలను మంత్రులను చేశామని, తెరాస ప్రభుత్వంలో మహిళలు ఏరి అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ భవిష్యత్ను దేవుడే చూసుకుంటాడు: రామచంద్రయ్య
కాంగ్రెస్ భవిష్యత్ను దేవుడే చేసుకుంటాడని మాజీ మంత్రి సి రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగానే ఉందన్నారు. మహానాడులో అన్నింటిపైనా తీర్మానం చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు.